మరో మార్కును చేరుకున్న‘అల వైకుంఠపురములో’

21 Feb, 2020 19:58 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్‌హిట్‌ అయ్యి అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని పాటలు జియో సావన్‌లో 100 మిలియన్‌ మార్కుని దాటినట్లు ఆ యాప్‌ నిర్వాహకులు ప్రకటించారు. అంతే కాకుండా ఈ రికార్డును సాధించిన మొట్టమొదటి సౌత్‌ ఇండియన్‌ ఆల్బమ్‌గా నిలిచిందన్నారు. సావన్‌ జియో సావన్‌గా లాంచ్‌ అయిన ఆరు నెలల్లోనే 100 మిలియన్‌ మార్కును దాటడం విశేషం. 

అన్ని వేడుకల్లో, కచేరీల్లో ఈ చిత్రంలోని పాటలు మారుమోగుతున్నాయి. చిత్రంలోని ‘సామజవరగమన’ పాట సోషల్‌ మీడియాలో ఆల్‌ టైమ్‌ రికార్డులతో సెన్సేషన్‌ సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్ర్తి రాసిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. ఆదిత్య మ్యూజిక్‌ రిలీజ్‌ చేసిన సామజవరగమన పాట ఒక్కరోజులోనే 10 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ‘సామజవరగమన’తో పాటు దాదాపు అన్ని పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడం ‘అల.. వైకుంఠపురములో’ గ్రాండ్‌ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి.

సిరివెన్నల సీతారామశాస్ర్తి, రామజోగయ్య శాస్ర్తి,కృష్ణ చైతన్య, కరసాల శ్యామ​,కళ్యాణ్‌ చక్రవర్తి, విజయ్‌కుమార్‌ బల్లా పాటలు రాయగా తమన్‌ అందించిన అద్బుత మ్యూజిక్‌ సినిమాకు బాగా ప్లస్‌అయ్యింది. అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు జియో సావన్‌లో 100 మిలియన్‌ మార్కును దాటడంపై సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని అల్లుఅర్జున్‌,త్రివిక్రమ​ శ్రీనివాస్‌, అల్లు అరవింద్‌,రాధాకృష్ణలకు డెడికేట్‌ చేస్తున్నట్లు తెలిపారు.సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంలోని పాటలు 50 మిలియన్‌ మార్క్‌ను దాటి సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్‌ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించాడు. 

మరిన్ని వార్తలు