అందుకే వారు గొప్ప నటులయ్యారు

14 Oct, 2019 06:07 IST|Sakshi

‘‘దర్శకుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో నటుడిగా దాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నేనెప్పుడూ దర్శకుణ్ణి ఇబ్బంది పెట్టలేదు. ‘వీడు బాగా నవ్విస్తాడు, ఏడిపిస్తాడు’ అని ప్రేక్షకులు ఎవర్ని భావిస్తారో వారే గొప్ప నటుడు’’ అన్నారు నటుడు అలీ. ఓంకార్‌ దర్శకత్వంలో అశ్విన్‌ బాబు, అవికా గోర్‌ జంటగా తెరకెక్కిన ‘రాజుగారి గది 3’ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన అలీ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ‘రాజుగారి గది 3’ ఒకఎత్తు. విభిన్నమైన భావోద్వేగాలున్న పాత్రను నాకు ఇచ్చారు ఓంకార్‌. డైరెక్టర్‌గా తనకు చాలా క్లారిటీ ఉంది. ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో రాబట్టుకుంటారు. మొదటి రెండు భాగాలకంటే ఈ సినిమా చాలా బావుంటుంది.

ఛోటా కె.నాయుడు విజువల్స్‌ ఈ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ చిత్రంతో అశ్విన్‌ నటుడిగా మరో ఎత్తుకి ఎదుగుతాడు. సెకండ్‌ హాఫ్‌లో సాయిమాధవ్‌ బుర్రా గారి డైలాగ్స్‌కు థియేటర్‌లో నవ్వులే. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. డీటీఎస్‌ మిక్సింగ్‌ చేసిన వ్యక్తి చూసిన ప్రతిసారీ నవ్వుతూనే ఉన్నారని నాకు తెలిసింది. దీన్ని బట్టి థియేటర్‌లో ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. బ్రహ్మానందం, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్‌ నారాయణగార్లు నాకు నచ్చిన హాస్యనటులు. రైటర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి కామెడీ యాక్టర్స్‌ అయ్యారు. కామెడీ ఎంత మోతాదులో ఉండాలో వాళ్లకు తెలుసు. అందుకే గొప్ప హాస్యనటులుగా పేరు తెచ్చుకున్నారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు