జంధ్యాల మార్క్‌ కామెడీతో.

29 Oct, 2018 00:57 IST|Sakshi
అలీ

హాస్యనటుడు అలీ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. (వీడు ఫోటో తీస్తే పెళ్లి అయిపోద్ది) అన్నది ట్యాగ్‌లైన్‌. రిషిత కథానాయికగా నటిస్తున్నారు. దిలీప్‌ రాజా దర్శకత్వంలో  పెదరావూరు ఫిల్మ్‌ స్టూడియో పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ క్లాప్‌ ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. దిలీప్‌ రాజా మాట్లాడుతూ– ‘‘హాస్యానికి, అపహాస్యానికి రెండు అక్షరాలు మాత్రమే తేడా.

దీన్ని గమనించే పూర్తిస్థాయి కామెడీ టైమింగ్‌ ఉన్న ఆర్టిస్టులతో మా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హాస్యంలో జంధ్యాలగారి, దర్శకత్వంలో బాలచందర్‌గారి ప్రభావం నాపై ఉంటుంది. అందుకే దేవుళ్లను మొక్కకుండా వారికే మొక్కాను. ఈ సినిమా జంధ్యాల మార్క్‌ కామెడీగా ఉంటుంది’’ అన్నారు.  ‘‘కథ చాలా బాగుంది. ఇళయరాజాగారి వద్ద పనిచేసిన యాజమాన్య సంగీతంలో, శ్రేయా ఘోషల్‌ పాడిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. చాలా కాలం తర్వాత ఫుల్‌ కామెడీ సినిమా చేస్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని అలీ అన్నారు. ప్రదీప్‌ రావత్, జీవ, సుధ, దేవిశ్రీ, ‘చిత్రం’ శ్రీను, టీనా చౌదరి, ‘జబర్దస్త్‌’ రాము తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు