లైంగిక ఆరోపణలు: గాయనికి హీరో నోటీసులు

20 Apr, 2018 08:44 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాక్‌ యువ నటుడు అలీ జఫర్‌పై గాయని మీషా షఫీ(36) సంచలన ఆరోపణలకు దిగింది. అలీ తనని లైంగికంగా వేధించాడంటూ గురువారం ఆమె తన ట్వీటర్‌లో ఓ పోస్టు చేయగా.. అది దుమారం రేపింది. ఇప్పటికైనా తాను మౌనం వీడకపోతే అర్థం లేదని.. మీటూ క్యాంపెయిన్‌ ఉవ్వెత్తున్న సాగుతున్న తరుణంలో తనపై జరిగిన అఘాయిత్యం గురించి కూడా స్పందిస్తున్నానని ఆమె ఆ పోస్టులో పేర్కొంది. ఇద్దరు పిల్లల తల్లి అని కూడా చూడకుండా జఫర్‌ తనను తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించాడని.. రేపు మరో అమ్మాయికి ఇలా జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ విషయం బయటపెడుతున్నానని ఆమె తన ట్వీటర్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. 

దీనికి అలీ జఫర్‌ ఘాటుగా బదులిచ్చాడు. మీటూ ఉద్యమానికి నేను మద్ధతు ఇస్తాను. నేనూ ఓ పాపకు తండ్రినే. నా గురించి నా మిత్రులకు, బంధువులకు బాగా తెలుసు. అలాంటిది నాపై ఇలాంటి విమర్శలు రావటం తట్టుకోలేకపోతున్నా. దాచటానికి ఏం లేదు. మౌనంగా ఉండటం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అందుకే న్యాయపరమైన చర్యలకు సిద్ధమైపోతున్నా అని అలీ జఫర్‌ తన ట్వీటర్‌లో ఓ పోస్టు చేశారు. మీషాకు లీగల్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 37 ఏళ్ల అలీ జఫర్‌ లాలీవుడ్‌(పాక్‌ సినీ ఇండ​స్ట్రీ)లో అర డజనుకుపైగా చిత్రాల్లో నటించగా.. బాలీవుడ్‌లో  తెరె బిన్‌ లాడెన్‌, మేరీ బ్రదర్‌ కీ దుల్హన్‌, డియర్‌ జిందగీ తదితర చిత్రాలతో భారతీయ ప్రేక్షకులకూ సుపరిచితుడు.

మరిన్ని వార్తలు