కంగనా వివాదంపై స్పందించిన అలియా

22 Apr, 2019 17:49 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ భామలు కంగనా రనౌత్‌, అలియా భట్‌ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న ట్వీట్‌ వార్‌ నేపథ్యంలో ఈ వివాదంపై అలియా భట్‌ నోరుమెదిపారు. అలియా నటనపై క్వీన్‌ కంగనా ఎద్దేవా , మణికర్ణిక హీరోయిన్‌పై అలియా తల్లి, మహేష్‌ భట్‌ భార్య సోని రజ్దాన్‌ వ్యాఖ్యలు, కంగనా సోదరి కౌంటర్‌లతో హాట్‌ హాట్‌గా ట్వీట్‌ వార్‌ సాగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ భామలిద్దరి మధ్య ట్వీట్లతో చెలరేగిన చిచ్చుపై అలియా ఎట్టకేలకు స్పందించింది.

అలియా ఇటీవల క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డు వేడుకలకు హాజరైన సందర్భంగా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ కంగనాతో విభేదాలపై తన వైఖరి ఏంటో స్పష్టం చేసింది. తన కంటే తన కుటుంబ సభ్యులు పది రెట్లు పరిణితి చెందిన వారని, బలమైన వ్యక్తిత్వం కలవారని చెప్పుకొచ్చింది. తానైతే కష్టపడటం, సంతోషంగా ఉండటం, ఇవాల్టికంటే రేపు మెరుగ్గా ఉండటంపైనే దృష్టిసారిస్తానని, ఇతరులు ఏం చెబుతున్నారు..ఏం మాట్లాడటంలేదనే విషయాలను అసలు పట్టించుకోనని, ప్రతిఒక్కరికీ వారు అనుకున్నది చెప్పే హక్కుందని తేల్చిచెప్పింది. కాగా అలియాపై తరచూ కంగనా చేస్తున్న వ్యాఖ్యలు మొత్తం వివాదంపై సోని రజ్ధాన్‌ స్పందిస్తూ చేసిన ట్వీట్‌ పెనుదుమారమే రేపింది.

కంగనాకు మహేష్‌ భట్‌ బాలీవుడ్‌లో తొలి బ్రేక్‌ ఇస్తే ఆమె ఏకంగా ఆయన భార్య, కుమార్తెను లక్ష్యంగా చేసుకుని విద్వేషం చిమ్ముతుండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఆమె ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు కంగనా సోదరి రంగోలి చందేల్‌ దీటుగా బదులిచ్చారు. అలియా, రజ్దాన్‌లను ఉద్దేశిస్తూ భారతీయులు కాని వీరు భారత వనరులపై బతుకుతూ ఇక్కడి ప్రజలను వేధిస్తున్నారని, అసహనంపై అసత్యాలు ప్రచారం చేస్తూ ద్వేషాన్ని వ్యాపింపచేస్తున్నారని ట్వీట్‌ చేయడం కలకలం రేపింది.

మరిన్ని వార్తలు