‘‘ఇక్కడే కాదు, చిన్న సినిమాలకు ఓవర్సీస్లో కూడా థియేటర్ల సమస్య ఉంది. అందుకే అక్కడివాళ్లూ మా సినిమా చూడాలనే ఆకాంక్షతో ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం. జింగ్రీల్.కామ్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు’’ అన్నారు నీలిమ తిరుమలశెట్టి. తారా అరుళ్రాజ్ సమర్పణలో వెంకట్రాహుల్, అనీషా అంబ్రోస్, శ్రీరమ్య ముఖ్య తారలుగా దయ కె. దర్శకత్వంలో నీలిమ నిర్మించిన చిత్రం ‘అలియాస్ జానకి’.
ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నీలిమ మాట్లాడుతూ- ‘‘ఏపీ మొత్తం 100కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇక్కడ విడుదల చేసిన రోజునే విదేశాల్లో ఆన్లైన్లో విడుదలవుతుంది. దీన్నెవరూ డౌన్లోడ్ చేసుకోలేరు. ఈ విధానం ద్వారా పైరసీని అడ్డుకునే వీలుంటుంది’’ అన్నారు.
మంచి సినిమా చూశామనే సంతృప్తి ప్రేక్షకులకు కలుగుతుందని దయ చెప్పారు. ఇంత మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉందని వెంకట్రాహుల్, ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే సినిమా అని శ్రీరమ్య తెలిపారు. 5 డాలర్లు వెచ్చిస్తే ఆన్లైన్లో ఈ సినిమాని చూడొచ్చని జింగ్రీల్.కామ్ అధినేత మయూర్ తెలిపారు.