బిజీ బిజీ

23 Jun, 2015 22:51 IST|Sakshi
బిజీ బిజీ

మన స్టార్ హీరోల్లో
చాలామంది ప్రస్తుతం
షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు.
మరికొందరు ప్రీ-ప్రొడక్షన్‌లో
పాలుపంచుకుంటూ,
నెక్ట్స్ మంత్ సెట్స్‌కి వెళ్లడానికి
రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఆ విశేషాల్లో కొన్ని మీ కోసం....

 
ఒకటికి రెండు!
సీనియర్ స్టార్ హీరో నాగార్జున చాలా బిజీగా ఉన్నారు. నూతన దర్శకుడు కల్యాణకృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ చేస్తున్నారు. ఆ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 26న హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూలు మొదలుకానుంది. ఇది కాక, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో కార్తీతో కలిసి నాగ్ నటిస్తున్న మరో చిత్రం కూడా చిత్రీకరణ దశలో ఉంది. జూలై 10 తర్వాత ఈ సినిమా షెడ్యూలు ఉంటుందని సమాచారం.
 
మహారాష్ట్ర టు గుజరాత్
పవన్‌కల్యాణ్ కూడా కొత్త సినిమా షూటింగ్‌కు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మిస్తున్న ‘గబ్బర్‌సింగ్2’ (ఇది వర్కింగ్ టైటిల్. అసలు పేరింకా ఖరారు కాలేదు) ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మహారాష్ట్రలోని పుణేకు సమీపంలో ఇటీవలే కొద్దిరోజులు చిత్రీకరణ జరిపారు. త్వరలోనే రెండో షెడ్యూల్ గుజరాత్‌లో ప్రారంభం కానుంది. మొన్నటి దాకా బెంగుళూరు పరిసరాల్లో జిమ్‌కు వెళుతూ కనిపించిన పవన్ ఆ షెడ్యూల్‌కు తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు.

ఒకటి చివర్లో..! మరొకటి మొదట్లో..!
స్టార్ హీరో మహేశ్ ఇప్పుడు ‘శ్రీమంతుడు’ చిత్రం పూర్తి చేసే హడావిడిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిఘట్టంలో ఉంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణా ఏడెకరాల్లో వేసిన గాజుల దుకాణాల స్ట్రీట్ సెట్‌లో చిత్రీకరణ సాగుతోంది. మహేశ్‌తో పాటు శ్రుతీహాసన్, తదితరులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మహేశ్ పుట్టిన రోజు (ఆగస్టు 9) కానుకగా, ఆగస్టు 7న ‘శ్రీమంతుడు’ విడుదల కానుంది. ఈ సినిమా ఇలా చివరలో ఉండగానే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మోత్సవం’కి ఇప్పటికే పూజాకార్య క్రమాలు జరిపారు. ‘శ్రీమంతుడు’ పూర్తవుతూనే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో మహేశ్ పాల్గొంటారు.
 
విదేశాలకు... రెడీ
‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ స్పీడు పెంచారు. వరుసపెట్టి సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా కమిటయ్యారు. ఈ నెలాఖరు నుంచి యూరప్‌లో భారీ షెడ్యూలు జరగనుంది. ఇప్పటికే సుకుమార్, ఛాయా గ్రాహకుడు విజయ్ కె. చక్రవర్తి యూరప్‌లో లొకేషన్ల ఎంపిక పూర్తిచేశారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తారని కృష్ణానగర్ కబురు.
 
జోరు... మాస్ ఎంటర్‌టైనర్ల హోరు
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన ‘కిక్2’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులతో పాటు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రవితేజ, మరోపక్క సంపత్ నంది దర్శకత్వంలో రాధా మోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో సాగుతోంది. ఆర్.ఎఫ్.సి.లో భారీ షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో రవితేజతో పాటు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, తదితర నటీనటులు పాల్గొంటున్నారు.
 
ఏకకాలంలో రెండు షూట్స్
రామ్ శరవేగంతో రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ స్రవంతి మూవీస్ సంస్థలోనే తయారవుతున్నాయి. ఈ రెండు సినిమాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు పరిచయమవుతుండడం విశేషం. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శివం’ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. గతవారం రోజులుగా ఊటీలో షెడ్యూలు జరుపుకుంది. సెప్టెంబరులో ఈ చిత్రం విడుదలవుతుంది. ఇక మరో చిత్రం కథ ‘హరికథ’ కూడా కొంత చిత్రీకరణ జరుపుకొంది. కిశోర్ తిరుమల దర్శకుడు. ఈ రెండు చిత్రాలకూ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు.
 
ఫీల్‌గుడ్ మూవీలో!
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మన్‌జిమా మోహన్, నాగచైతన్య జంటగా తయారవుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది. గతంలో ఒకే కథ వేర్వేరు హీరోలతో తమిళంలో ‘విన్నై తాండి వరువాయా’, తెలుగులో ‘ఏం మాయ చేశావే’ చేసి, విజయం సాధించినట్లే, ఇప్పుడు ఈ సినిమాను గౌతమ్ మీనన్ రూపొందిస్తున్నారు. ఈ తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంలో తెలుగు వెర్షన్‌లో నాగచైతన్య హీరో అయితే, తమిళంలో శింబు కథానాయకుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాట సాగుతోంది.
 
యాక్షన్  హంగామా
అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం షూటింగ్ దేశవిదేశాల్లో జరుగుతోంది. ఇటీవలే స్పెయిన్‌లో కీలక ఎపిసోడ్స్ చిత్రీకరణ చేసివచ్చారు. కొద్దిరోజుల్లోనే బ్యాంకాక్‌లో షూటింగ్ చేయడానికి చిత్ర బృందం బయలుదేరి వెళ్తోంది. అక్కడ పాటలు, ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మిస్తున్నారీ చిత్రాన్ని.
 
ముచ్చటగా మూడు!
దేవ కట్టా దర్శకత్వంలో ‘డైనమైట్’ చిత్రంతో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై రిలీజ్ కోసం సన్నాహాలు జరుపుకొంటూ ఉండగానే, ఆయన మరో రెండు సినిమాలు ఎనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు హనుమాన్ నిర్దేశకత్వంలో ఒక సినిమా, తనికెళ్ళ భరణి దర్శకత్వంలో పౌరాణిక గాథ ‘కన్నప్ప కథ’కు కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేకించి, ‘కన్నప్ప కథ’ కోసం లుక్ నుంచి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
 
ఇక అల్లు అర్జున్, గోపీచంద్ తదితర కథానాయకుల కొత్త చిత్రాలు కూడా ఇప్పటికే ముహూర్తాలు జరుపుకొన్నాయి. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో సెట్స్ మీదకు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.