సరికొత్త కోణానికి నాంది

21 Jan, 2020 00:19 IST|Sakshi
‘అల్లరి’ నరేశ్, హరీశ్‌ శంకర్‌

‘అల్లరి నరేష్‌ నూతన చిత్రం ‘నాంది’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాతో విజయ్‌ కనకమేడల దర్శకుడిగా, దర్శకుడు సతీష్‌ వేగేశ్న నిర్మాతగా పరిచయమవుతున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ హీరోయిన్‌. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ క్లాప్‌నివ్వగా, నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ‘అల్లరి’ నరేష్‌ మాట్లాడుతూ – ‘‘క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది.

అందరూ కొత్తవారితో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన నరేష్‌గారికి, సతీష్‌గారికి థ్యాంక్స్‌. క్రైమ్‌ థ్రిల్లర్‌లో సాగే కథ అయినప్పటికీ ఓ సామాజిక అంశాన్ని కూడా చర్చిస్తున్నాం’’ అన్నారు విజయ్‌ కనకమేడల. ‘‘ఈ నెల 22నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. మార్చిలో షూటింగ్‌ పూర్తి చేసి, వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సతీష్‌ వేగేశ్న. ‘‘నరేష్‌గారిలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి. ఈ సినిమాకు కథ: వెంకట్, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కెమెరా: సిద్‌.

మరిన్ని వార్తలు