ప్రతిరోజూ పండగే అందరి విజయం 

2 Jan, 2020 01:43 IST|Sakshi
సాయి తేజ్, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, అల్లు అరవింద్, మారుతి, ‘బన్నీ’ వాస్‌

– అల్లు అరవింద్‌ 

‘‘మారుతి ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కథని నాకు చెప్పినప్పుడు యూత్‌ఫుల్‌ ఎలిమెంట్స్‌ లేవు కదా? అన్నాను. కానీ మారుతి నమ్మకంగా ఉన్నాడు. షూటింగ్‌ పూర్తయ్యాక సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూ ఉన్నాం. థియేటర్స్‌లో ఆడియన్స్‌ కూడా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. మా సినిమాను పెద్ద హిట్‌ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ఏడాది చివర్లో సాయితేజ్‌ సక్సెస్‌ కొట్టాడు. ఈ విజయం అందరిదీ’’ అని అల్లు అరవింద్‌ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 20న విడుదలైంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రతిరోజూ పండగ సంబరాలు’ కార్యక్రమంలో పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే విజ యాన్ని ఉహించాను. విదేశాలకు వెళ్లిన తర్వాత మనుషుల మధ్య ప్రేమ, అభిమానాలు తగ్గాయి. ఈ పాయింట్‌ ఆడియన్స్ బాగా కనెక్ట్‌ అయ్యారు’’ అన్నారు. ‘‘ఒక తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాలనుకున్నా. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు మారుతి. ‘‘ప్రతిరోజూ పండగే’ సినిమాని సపోర్ట్‌ చేసున్న వారికి ధన్యవాదాలు. ఈ సక్సెస్‌ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితమిస్తున్నా’’ అన్నారు సాయితేజ్‌. ‘‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ ఇచ్చిన అరవింద్, వాసుగార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు తమన్‌.  

మరిన్ని వార్తలు