లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది

15 May, 2018 01:19 IST|Sakshi
ప్రియాంకా దత్, విజయ్‌ దేవరకొండ, స్వప్నా దత్, వినయ, అశ్వనీదత్, నాగ్‌ అశ్విన్, అల్లు అర్జున్, రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్‌

‘‘నిన్నటికి నిన్న వచ్చిన ‘బాహుబలి’ మన తెలుగు సినిమా అని రొమ్ము విరిచి చెప్పుకున్నాం. ‘మహానటి’ లాంటి సినిమాతో మళ్లీ అంతే ఫీలింగ్‌ కలిగింది. తెలుగు ఇండస్ట్రీ గర్వించే సినిమా ఇది. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ప్రేక్షకుడు ‘మహానటి’ని గుండెల్లో పెట్టుకుంటారు’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్‌ పతాకంపై ప్రియాంకా దత్‌ నిర్మించిన ‘మహానటి’ గత బుధవారం విడుదలైన విషయం తెలిసిందే.

టైటిల్‌ రోల్‌లో కీర్తీ సురేష్‌ నటించారు. ఈ చిత్రబృందాన్ని అల్లు అరవింద్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూశాక నాగ్‌ అశ్వి¯Œ కి కాల్‌ చేసి సూపర్‌ హిట్, బ్లాక్‌బస్టర్‌ వంటి పిచ్చి పదాలు వాడకుండా ‘థ్యాంక్యూ ఫర్‌ మేకింగ్‌ అజ్‌ ప్రౌడ్‌’ అని చెప్పాను. స్వప్న, ప్రియాంక, అశ్వినీదత్‌ గారు తప్ప ఈ సినిమాను ఇంకెవ్వరూ తీయలేరు. లెక్కపెట్టి తీస్తే ఎంత లెక్కపెడితే అంతే వస్తుంది. లెక్క పెట్టకుండా తీస్తే లెక్కలేనంత వస్తుంది. సినిమా ఈజ్‌ నాట్‌ ఎ నంబర్‌.. ఇట్స్‌ ఏ ఎక్స్‌పీరియన్స్‌  ‘మహానటి ఈజ్‌ ప్రైజ్‌లెస్‌’’ అని చెప్పారు.

‘‘సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్‌ స్తాయి. కానీ కొన్ని మాత్రం ఇండస్ట్రీ స్థాయిని పెంచేవి వస్తుంటాయి. ‘మహానటి’ ఆ కోవకు చెందినదే. సావిత్రి, జెమినీ గణేశన్‌ల ప్రేమకథను ‘దేవదాసు’తో ముడిపెట్టడంతో పాటు ఆమె మందు అలవాటు చేసుకునే సన్నివేశం వంటివి పొయెటిక్‌గా, సెటిల్డ్‌గా చెప్పిన విధానం అద్భుతం’’ అన్నారు రాజమౌళి. రమేశ్‌ ప్రసాద్,  కేయస్‌ రామారావు, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, పి.  కిరణ్,  బి.వి.యస్‌.యన్‌ ప్రసాద్,  పరుచూరి సోదరులు, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్, కరుణాకరన్, మారుతి, నందినీ రెడ్డి, సంపత్‌ నంది, త్రినాథ్‌ రావు నక్కిన, విజయ్‌కుమార్‌ కొండా తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు