నేను వెంటపడడం మొదలుపెట్టా!

9 Feb, 2016 23:26 IST|Sakshi
నేను వెంటపడడం మొదలుపెట్టా!

- అల్లు అరవింద్
 ‘‘నేను నిర్మించిన చిన్న చిత్రాలు చూడండి అంటూ దర్శకుడు హుస్సేన్ షా నా వెంట పడ్డాడు. అవి చూసిన తరువాత నేను నివ్వెరపోయా. నా బ్యానర్‌లో సినిమా చేయమని ఇప్పుడు నేను తన వెంటపడడం మొదలుపెట్టా. సుకుమార్ వద్ద కొద్ది రోజులు పనిచేశాడు. ‘నాన్నకు ప్రేమతో’ చూసిన నేను హుస్సేన్ షాను ఆఫీసుకు పిలిపించి ఏప్రిల్ నుంచి మా బేనర్‌లో సినిమా చేయమని అడిగా. అందుకు తను కూడా ఓకే అన్నాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.
 
 తరుణ్ శెట్టి, అవంతిక, కిరీటి దామరాజు, జెన్నీ, భరణ్ ప్రధాన పాత్రల్లో నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై హుస్సేన్ షా దర్శకత్వంలో రూపొందిన ‘మీకు మీరే.. మాకు మేమే’ పాటలను అల్లు అరవింద్ చేశారు. ట్రైలర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. సుకుమార్ మాట్లాడుతూ- ‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఆర్య-2’లో, వేరే సినిమాల్లో హుస్సేన్ షా చిన్న చిన్న పాత్రలు చేస్తూ దర్శకత్వం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తను తీసిన షార్ట్ ఫిలిం చూసి జెలసీ ఫీలయ్యా.
 
  ‘నాన్న కు ప్రేమతో’ను ఏ హాలీవుడ్ నుంచో కాపీ కొట్టాననుకుంటారు. కానీ, నేను కాపీ కొట్టింది హుస్సేన్ షా నుంచే. ఈ చిత్రం మూలకథ తనదే. భవిష్యత్తులో అతను నా బేనర్లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. నిర్మాతలు లగడపాటి శ్రీధర్, రామ్మోహన్, హీరో తరుణ్ శెట్టి, చిత్ర దర్శకుడు కూడా మాట్లాడారు. అవంతిక, కిరీటి దామరాజు, జెన్నీ, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్, కెమేరామ్యాన్ సూర్య వినయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తీక్ వంశీ తాడేపల్లి పాల్గొన్నారు.