బన్నీ.. ఉగాది రోజున క్లారిటీ ఇస్తాడట!

3 Apr, 2019 13:15 IST|Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్ కావటంతో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆలోచనలో పడ్డాడు. తరువాత చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.  చాలా కథలు విన్న తరువాత ఫైనల్‌గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు బన్నీ. అయితే సినిమా ప్రకటించి చాలా రోజులైన ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ సెట్స్‌ మీదకు వెళ్లలేదు. దీంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ తరువాత త్వరలో వివరాలు వెల్లడిస్తాం అన్న ప్రకటన వచ్చినా అభిమానులు సంతృప్తి చెందలేదు.

అయితే ఉగాది సందర్భంగా సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు దాదాపు కొలిక్కి రావటంతో షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది. రిలీజ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది లాంటి అంశాలను ఉగాది రోజు వెల్లడిస్తారని తెలుస్తోంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్‌ సినిమాను రీమేక్‌ చేయాలని భావించినా వర్క్‌ అవుట్ కాకపోవటంతో కొత్త కథతోనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా పూజా హెగ్డే నటించనుంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం భారీ వసూళ్లు సాధించటంతో సెంటిమెంట్ పరంగా కూడా పూజా కలిసొస్తుందని భావిస్తున్నారట చిత్రయూనిట్‌.

మరిన్ని వార్తలు