కాకినాడ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు తివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో రూపొందిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్ కాకినాడలో జరగనుంది. ఈ షెడ్యూల్లో బన్నీపై పోరాట సన్నివేశాలతో పాటు, కొన్ని ముఖ్యమైన సీన్స్ను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఇందుకోసం బన్నీ బుధవారం కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు బన్నీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏఏ19గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ‘నేను నాన్న’ అంటూ ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. మరోసారి ఫాదర్ సెంటిమెంట్తో తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈ సినిమాలో టబు, జయరాం, సుశాంత్, మురళీ శర్మ, రావూ రమేష్, నవదీప్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.