త్రివిక్రమ్‌ ముందే ఫిక్సయ్యారు: బన్నీ

28 Jan, 2020 15:02 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అల వైకుంఠపురములో. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి బరిలో దిగి సూపర్‌ హిట్‌గా నిలిచింది. విడుదలైన తొలి నాటి నుంచి రికార్డుల వేట దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. వారి ముచ్చట్లు ఏంటో చూద్దాం...

ఇండస్ట్రీ హిట్టయినందుకు ఎలా ఫీలవుతున్నారు?
అల్లు అరవింద్‌: ఇండస్ట్రీ హిట్ అని నిర్మాతలు ప్రకటించారు. ఇది నా విజయం కాదు. ఇది జనం నాకిచ్చిన ఒక అప్రిసియేషన్ టోకెన్. ఇది నేను ఎంత సంపాదించుకున్నాను అనేది కాదు. ఒక సినిమా రికార్డు వచ్చినప్పుడు అది హీరో ర్యాంకు కాదు. జనం ఆ సినిమాకి ఇచ్చిన ర్యాంకు. టాప్ టెన్ రికార్డ్స్ తీసుకుంటే ఆ సినిమాల్లో ఏ హీరో ఉంటే ఆ హీరోకి ఆ ర్యాంక్ అనేది కాదు. జనం ఆ సినిమాని అంతగా ఇష్టపడ్డారు అని అర్థం. జనం ఆ స్థాయిలో ఆ సినిమాను ఇష్టపడినందుకు నాకు అమితమైన ఆనందం. అందులోనూ అది నా సినిమా అవటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది.

సినిమా చాలా చోట్ల బాహుబలి రికార్డుని క్రాస్ చేసింది. అయినా కానీ ఇక్కడ నాన్-బాహుబలి రికార్డు అని పెట్టడానికి కారణం ఏంటి?
అల్లు అరవింద్:  మీరు చెప్పింది నిజమే.  ఇది చాలా చోట్ల 'బాహుబలి 2' తర్వాత వచ్చి ఆగింది. బాహుబలి అనేదాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ మాట అని ఉండొచ్చు. కలెక్షన్ల గురించి హీరోకు, డైరెక్టర్‌కు తెలియకపోవచ్చు. ఎందుకంటే రోజు ఫిగర్లు చూసుకొని ఆనందపడేది మేము. సినిమా ఎంత బాగా వచ్చింది అని చూసుకొని వాళ్లు ఆగిపోతారు. ఎంత బాగా వసూలు అవుతుందనేది చూసుకునే దగ్గర మేము మొదలవుతాం. యూఎస్‌లో టాప్ త్రీలో ఉంది. త్వరలో నెక్స్ట్ బాహుబలికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ఇంకా కలెక్ట్ చేస్తోంది.

చాలా రోజుల తర్వాత రికార్డ్స్ గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. దీని మీద మీరేమంటారు?
అల్లు అర్జున్: ప్రతి హీరోకి ఏదో ఒక టైంలో ఒక రికార్డు ఫిలిం పడుతూ ఉంటుంది. నాకు ఇదివరకు ఒక రికార్డు ఫిలిం పడింది కానీ ఓవరాల్ గా అన్నిచోట్ల పడలేదు. అన్ని జిల్లాల్లో యునానిమస్ గా ఆల్టైమ్ రికార్డు ఎప్పుడూ పడలేదు. నాన్నకు గీతా ఆర్ట్స్లో దాదాపు 10 ఆల్‌టైమ్ రికార్డు సినిమాలు పడ్డాయి. చిరంజీవిగారితో చాలా సినిమాలు, గజినీ, మగధీర వంటి సినిమాలు పడ్డాయి. రికార్డ్స్ ఆయనకు కొత్త విషయం కాదు. నాన్న గారితో ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డు ఒక కొడుకుగా కొట్టడం సంతోషంగా ఉంది. దట్ ఈజ్ ఆల్వేస్ మెమరబుల్. మళ్ళీ మేము ఇంకోసారి రికార్డు కొట్టొచ్చు. కానీ ఇంత ఆనందం రాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ వెరీ స్పెషల్. ఐ ఆల్వేస్ చెరిష్ ఇట్. మా ఫాదర్ తో రికార్డు కొట్టాలని ఎప్పటినుంచో కోరిక. దీనికి కారణమైన అందరికీ మరోసారి థాంక్స్. ప్రత్యేకంగా త్రివిక్రమ్ గారికి.

త్రివిక్రమ్ ఈ కథ మీకు చెప్పినప్పుడు ఈ స్థాయి రికార్డు కొడుతుండని మీరు ఊహించారా?
అల్లు అర్జున్:  మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయిని ఇవ్వలేమని ఈ సినిమాలో ఆయన ఒక డైలాగ్ రాశారు. అది ఆబ్సల్యూట్లీ ట్రూ. నిజంగానే ఈ సినిమాతో అంత స్థానం వచ్చింది. ఆ స్థాయికి తగ్గట్టు నేను ఈ ప్రయాణం నడిపించాలని అనుకుంటున్నాను. ఈ సినిమా ఇంత చేస్తుందని నాకు తెలియదు. ఏ సినిమాకీ తెలియదు, ఎవరు చెప్పలేరు. ఈ సినిమాకి మనం బెస్ట్ చేయాలని.. నేను పని మాత్రం చేశాను. జనాలు దాన్ని అప్రిషియేట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇందులో నా క్రెడిట్ ఉందంటే మాత్రం అది అబద్ధం. త్రివిక్రమ్ గారు చెప్పిన వెంటనే ఇది గోల్డ్ మైన్ అవుతుందని మాత్రం ఇది నేను చేయలేదు. ఆయన ఒక మంచి కథ చెప్పారు, నాకు నచ్చింది. మేమిద్దరం సరదాగా ఒక హ్యాపీ సినిమా చేయాలనుకున్నాం.  మేము మా పని చేశాం. అది జనానికి వచ్చింది. 

ఈ సినిమా సక్సెస్ విషయంలో మీ ఫ్యాన్స్ కి ఎంత రేషియో ఇస్తారు? జనరల్ ఆడియన్స్ కి ఎంత రేషియో ఇస్తారు?
అల్లు అర్జున్:  నిజాయితీగా చెప్పాలంటే దాన్ని విడదీసి చెప్పలేం. చూసిన వాళ్ళలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, జనరల్ ఆడియెన్స్ ఎంతమంది ఉన్నారు అనేది చెప్పలేం. మా కనెక్షన్‌లో లేని ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఫ్యాన్స్ అంటే గొడవ చేసే వాళ్ళు, బ్యానర్లు కట్టే వాళ్ళు కాదు. కామ్‌గా, అడ్మైరింగ్‌గా ఉండే వాళ్ళు కూడా ఫ్యాన్స్ కిందే లెక్క. ఎంతమంది ఫ్యాన్స్‌కు నచ్చింది, ఎంత మంది అడ్మైరర్స్‌కు నచ్చింది, ఎంతమంది సామాన్య ప్రజలకు నచ్చింది అనేది విడదీసి చెప్పలేం. ఒకటి మాత్రం ఖాయం. ఫ్యాన్ అయినా నాన్ ఫ్యాన్ అయినా, సినిమా నచ్చితే స్టుపెండస్ సక్సెస్ చేస్తారు. అందరికీ సినిమా నచ్చింది. థాంక్యూ వెరీ మచ్ ఫర్ దట్‌.

ఈ సక్సెస్ క్రెడిట్ మీరు ఎక్కువగా ఎవరికి ఆపాదిస్తారు?
అల్లు అర్జున్: సినిమా అనేది ఎంటైర్ టీం వర్క్. ఒకరి పేరు చెప్పాల్సి వస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. నిజానికి నేను 'నా పేరు సూర్య' చేసిన తర్వాత వక్కంతం వంశీ గారు, నేను, బన్నివాసు కలిసి ఉన్నప్పుడు ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు వక్కంతం వంశీ గారు త్రివిక్రమ్ గారి పేరు సూచించారు. ఆయనతో కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పారు. ఆయన మాటల్లో ఒక పల్స్ కనిపించింది. నా మైండ్‌లో ఆయనే త్రివిక్రమ్‌తో గారితో చేయాలని ఐడియా వేశారు.

ఈ సినిమాతో మీకు పర్ఫార్మర్ గా కూడా ఒక మంచి ఐడెంటిఫికేషన్ వచ్చింది. దానికి ఎలా ఫీలవుతున్నారు? 
అల్లు అర్జున్:  ఈ సినిమా విడుదలైన మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారని నాకు అసలు తెలియదు. అది 100% త్రివిక్రమ్ గారు నా మీద వేసిన ట్రిక్. ఆయన ఒకటన్నారు.. 'మీకు తెలియకుండా మీతో బాగా చేయించాలని నేను ఫిక్స్ అయ్యాను' అని. నా పర్ఫామెన్స్‌కు ఇంత అప్రిసియేషన్ వస్తుందని నా రిమోట్ ఇమేజినేషన్‌లో కూడా లేదు. నేను త్రివిక్రమ్ గారితో కూడా అన్నాను. 'ఏం సార్ నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను షాక్‌లో ఉన్నాను' అని. నా చేత ఎలా చేయించారనేది ఆయన చెప్తారు. నాతో ఆయన చేయించారు. నేను ఏం చేశాను అని ఆలోచించే లోపే అందరూ అదిరిపోయింది అన్నారు.

ఏం మాయ చేసారు సార్ మీరు?
త్రివిక్రమ్:  నాకే తెలియదు సార్.
అల్లు అరవింద్:  సినిమా చూశాక 'బన్నీ.. నీ ఫీలింగ్ ఏంటి?' అని నేను అడిగాను. 'ఇది త్రివిక్రమ్ మాయ డాడీ' అని అన్నాడు.
త్రివిక్రమ్: రుద్దినట్లు కాకుండా చాలా ఈజీగా చెప్పినట్లు ఉండాలని ట్రై చేశాను.  కొన్ని సీన్లు ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలో కొన్ని పాయింట్లు పెట్టుకున్నాము. తను చేసిన ఇంటర్వెల్ సీను నాకు సంబంధించినంత వరకు ఒక రిఫరెన్స్ పాయింట్.  ప్రతి షాట్ ఒక ఫిలింలాగా  ట్రీట్ చేశాం. నేను ఏదైతే ఒక గ్రాఫ్ అనుకున్నానో, ఆ గ్రాఫ్ పట్టుకొని తాను చేసుకుంటూ వెళ్ళాడు.

ఈ గ్రాండ్ సక్సెస్ పై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
త్రివిక్రమ్: నంబర్స్ అనేవి ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అవసరం. అక్షరం మాకు ఎంత అవసరమో అంకెలు వాళ్లకు అంత అవసరం. నాకు కానీ, బన్నీకి కానీ అంకెల బదులు ఎంతమంది ఈ సినిమా చూశారు, ఎంతమందికి నచ్చింది అనే విషయం మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఏ ఆర్టిస్ట్ అయిన కోరుకునేది తన మాట ఎక్కువమందికి వినిపించాలని, ఎక్కువ దూరం చేరాలని. నేనైతే దాన్ని అలాగే చూస్తాను. ఇది ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అని మొదలు పెట్టినప్పుడే తెలుసు. దీన్ని ఎంత కాంటెంపరరీగా తీస్తామనేది అనేది ముందు నుంచి కాన్షియస్ గానే ఉన్న విషయం.

అల్లు అర్జున్:  త్రివిక్రమ్ గారు, నేను కలిసి చేస్తే ఉండే పాజిటివ్ ఎనర్జీ జనంలో చూశాను. మళ్లీ మేము కలిసి పనిచేస్తే ఆ ఆసక్తి అనేది ఉంటుందని అనిపించింది. నిజంగా హ్యాట్రిక్ అని అనుకోలేదు. మూడోదానికి రిథం సెట్ అయింది.  బాల్ కనెక్ట్ అయి బౌండరీ దాటేసింది. ఇంతమంది చూశారు, ఇంతమంది ఇష్టపడ్డారు అనేది పెద్ద విషయం. ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసిందన్నప్పుడు మనం మరింత ఎక్స్పరిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బెటర్ ఫిలిమ్స్ చేయొచ్చు.

మీరు, ప్రభాస్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరి మధ్య దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా?
అల్లు అర్జున్: బాహుబలి గురించి నేను ఇప్పటివరకు మాట్లాడే అవకాశం రాలేదు. రాజమౌళి గారికి పర్సనల్‌గా మాత్రం చెప్పాను. బాహుబలి మూవీతో ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చినా కూడా అందుకు అతను అర్హుడు. ‘మిర్చి’లాంటి సినిమా తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లో సంపాదించుకుని ఉండొచ్చు. అయిదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. మిగతా మూడున్నర సంవత్సరాలు ఖాళీగా ఉంటాయి. అంతకాలం ఒక విషయం నమ్మి కూర్చున్నదానికి, అతను త్యాగం చేసినదానికి ఎంత వచ్చినా కూడా దానికి అతను అర్హుడే. మేడమ్ టుస్సాడ్స్ లో అతని విగ్రహం పెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఫీలయ్యాను.  ప్రభాస్‌కు అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈరోజు మా రెండు సినిమాలు టాప్ టు ఫిలిమ్స్ అయినందుకు చాలా హ్యాపీ. రికార్డ్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇవాళ మనం కొట్టవచ్చు, ఆర్నెళ్ల తర్వాత ఇంకొకరు కొట్టొచ్చు. అయితే ప్రజల మనసుల్లో ఒక సినిమా ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూశారా అది ఫరెవర్. దాన్నెవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారు, రామ్ చరణ్ ఎక్కడ ఏమి మాట్లాడలేదు. మరి మీతో ఏం మాట్లాడారు?
అల్లు అర్జున్: చిరంజీవి గారు చాలా ఆనందపడ్డారు. ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు. 'మీకు ఎక్కువగా నచ్చి అలా అంటున్నారేమో' అని నేను అన్నాను. 'లేదు లేదు నాకు తెలిసిపోతుంది, ఒక సినిమా ఏ లెవల్లో ఉంటుందనేది' అని చెప్పారు.  అలా చెప్పటం  అంత ఈజీ కాదు.  తను ఒక్కరే చూసినా ఎంత పీపుల్ పల్స్‌లో ఆయన ఉన్నారో నాకు అర్థమైంది. ఒక సినిమా చూసి ఇది ఎంత చేస్తుంది అని చెప్పడానికి ఎంత అనుభవం కావాలి! హి ఈజ్ రియల్లీ గ్రేట్.
త్రివిక్రమ్: మేమిద్దరం అయితే షాక్ తిన్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆ మాట అన్నారేమో అనుకున్నాను. రామ్ చరణ్ నాతో మాట్లాడారు.

ఈ రికార్డ్స్ ని పక్కన పెడితే మూడు సినిమాల జర్నీలో త్రివిక్రమ్ గారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమిటి?
అల్లు అర్జున్: ప్రతి సినిమాలో ఒక విషయం నేర్చుకున్నాను. ఆయన చాలా ఓపెన్‌గా ఉంటారు. మనం చేసే పనిపై ఓపెన్‌గా, హానెస్ట్గా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. డిటాచ్ అయ్యి అటాచ్ అవటం నేర్చుకున్నాను. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి అది కూడా ఒక కీలకమని నమ్ముతున్నాను.

ఇండస్ట్రీ హిట్ వచ్చింది కదా.. మీ అబ్బాయికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు?
త్రివిక్రమ్: దీనిపై అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ కు ఒక వినతిపత్రం సమర్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
అల్లు అరవింద్: తండ్రి కొడుకులుగా స్నేహితుల్లా ఉంటాము. ప్రొఫెషనల్‌గా వచ్చేటప్పటికి కొంచెం టైట్‌గా ఉంటాను. చిరంజీవి గారి దగ్గరనుంచి ఇప్పటివరకు నేను పనిచేసిన హీరోలందరికీ వారం రోజుల ముందే వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళ ఇంటికి పంపించేస్తూ వచ్చాను. అలాగే బన్నీకి కూడా అది తప్పలేదు.

రంగస్థలం, సైరా ఇప్పుడు 'అల వైకుంఠపురములో' వరుసగా మెగా హీరోల ఇండస్ట్రీ రికార్డ్స్ టాప్ ఫైవ్ లో ఉండటం ఎలా అనిపిస్తోందన్న ప్రశ్నకు సమాధానంగా అలా జరగటం ఎవరికైనా సంతోషమే కదండీ.. నాకూ ఆనందంగానే ఉంది అంటూ తమ సంభాషణను ముగించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. (చదవండి: అల వైకుంఠపురంలో మూవీ రివ్యూ)

మరిన్ని వార్తలు