బన్ని- సుకుమార్‌ చిత్ర టైటిల్‌పై క్లారిటీ!

20 Jan, 2020 16:23 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్యూట్‌ హీరోయిన్‌ రష్మిక మందన జంటగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. బన్ని-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వర్కింగ్‌ టైటిల్‌ ‘ఏఏ20’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర విశేషాల గురించి సోషల్‌ మీడియాలో పలు కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. కథ ఇదే అంటూ, నటీనటులు వీరే, టైటిల్‌ ఫిక్సయిందంటూ అనేక వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో చిత్ర బృందం వీటన్నింటిపై ఓ క్లారిటీ ఇచ్చింది. 

‘అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. టైటిల్‌, ఇతరాత్రా అంశాలపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. టైటిల్‌ ఫిక్సవ్వగానే అధికారికంగా ప్రకటిస్తాం. టైటిల్‌ ఖరారయ్యేవరకు వర్కింట్‌ టైటిల్‌ ‘ఏఏ20’ నే కొనసాగిస్తాం’ అంటూ చిత్ర బృందం ఓ ట్వీట్‌ చేసింది. దీంతో ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే పేరు కాదనే తెలుస్తుంది. తన సినిమా టైటిళ్ల విషయంలో చాలా క్రియేటివ్‌గా ఉండే సుకుమార్‌.. ఈ చిత్రానికి కూడా విభిన్నంగా, వైవిధ్యంగా ఉండే టైటిల్‌ను అన్వేషిస్తున్నట్లు సమాచారం. 

ఇక కేరళలో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్‌ పిబ్రవరి తొలి వారం నుంచి ఆరంభం కానుంది. ‘అల..వైకుంఠపురములో’ సినిమా బిజీలో ఉండటంతో బన్ని తొలి షెడ్యూల్‌లో పాల్గొనలేదు. పిబ్రవరి నుంచి జరిగే రెగ్యులర్‌ షూటింగ్‌లో అల్లు అర్జున్‌ పాల్గొంటాడు. ఈ చిత్రంలో బన్ని ఇంట్రడక్షన్‌ సీన్‌ కోసం సుకుమార్‌ భారీగా ప్లాన్‌ చేస్తున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఇక విజయ్‌ సేతుపతి, అనసూయాలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు మరో టాక్‌. అయితే నటీనటుల విషయంలో చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో సుకుమార్‌ ఉన్నట్లు సమాచారం. 
 

 

చదవండి: 
బన్ని-సుకుమార్‌ సినిమా టైటిల్‌ ఇదేనా?
ఆ వైకుంఠపురము.. ఎవరిదంటే!

మరిన్ని వార్తలు