నటనతో కంటతడి పెట్టించాడు

16 Jul, 2018 00:56 IST|Sakshi
సాయి కొర్రపాటి, మురళీ శర్మ, కల్యాణ్‌ దేవ్, అల్లు అర్జున్, మాళవికా నాయర్, రాకేష్‌ శశి

అల్లు అర్జున్‌

‘‘ఓ వైపు పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు తీస్తున్న సాయి కొర్రపాటిగారికి కంగ్రాట్స్‌. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తూ మంచి కంటెంట్‌తో చిత్రాలు తీస్తున్న ఆయనంటే నాకు చాలా గౌరవం. మంచి కథతో వస్తే వారాహి బ్యానర్‌లో సినిమా చేస్తాను’’ అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. కల్యాణ్‌ దేవ్, మాళవికా నాయర్‌ జంటగా రాకేష్‌ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా ‘విజయోత్సవం’ నిర్వహించారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌ ఫస్ట్‌ సినిమా ఎలా చేస్తాడా అనుకున్నా. ఎమోషనల్‌ సీన్స్‌లో కంట తడి పెట్టించాడు. మురళీశర్మగారు బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. రాకేష్‌ శశి చాలా బాగా తీసాడు. బ్యూటీతో పాటు నటన కనబరచే కథానాయికలంటే నాకు ఇష్టం. మాళవిక వండ్రఫుల్‌గా చేశారు. సినిమా నచ్చబట్టే విజయోత్సవానికి వచ్చా. నేను, నా భార్య స్నేహ సినిమా చూశాం. క్లైమాక్స్‌ అయిపోయాక నేను ఐదు నిమిషాలు లేవలేదు. ‘దిస్‌ ఈజ్‌ ద వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ క్లైమాక్స్‌ ఇన్‌ మై లైఫ్‌’’ అన్నారు.

‘‘విజేత’ సినిమా చూసాక కొన్ని వందల మెసేజ్‌లు పంపించారు. తండ్రీ కొడుకుల కథతో జెన్యూన్ గా మంచి సినిమా చేశారని అభినందించారు’’ అన్నారు రాకేష్‌ శశి. ‘‘ప్రేక్షకుల స్పందన బాగుంది. ‘చాలా బాగా ఏడ్చా వు’ అన్నది నాకొచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌’’ అన్నారు కల్యాణ్‌ దేవ్‌. నిర్మాత సాయి కొర్రపాటి, మాళవికా నాయర్, కెమెరామెన్‌ సెంథిల్‌ కుమార్, నటులు మురళీ శర్మ, రాజీవ్‌ కనకాల, మహేశ్, సుదర్శన్, కిరీటి, భద్రం, ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు