గాయని గా మారిన నిర్మాత

7 Oct, 2017 10:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: స్వతహాగా ఉన్న ప్రతిభ, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పడుతుంది. ఇందుకు ఉదాహరణలు ఎన్నో. అదే విధంగా నిర్మాతగా తన దక్షతను చాటుకుంటున్న ఐశ్వర్య ఇప్పుడు తనలో దాగి ఉన్న గాయని అనే ప్రతిభకు సాన పెడుతున్నారు. ఐశ్వర్య ఎవరోకాదు స్వయంకృషితో ఎదిగి, భారీ చిత్రాలకు చిరునామాగా మారిన ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం కోడలు. యువ దర్శక, నటుడు జ్యోతికృష్ణ భార్య అన్నది గమనార్హం. అంతే కాదు ఐశ్వర్య సంచలన విజయం సాధించిన ఆరంభం, ఎన్నైఅరిందాల్, వేదాళం, కరుప్పన్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

తాజాగా ఆమె తనలోని సంగీత జ్ఞానానికి పదునుపెట్టడం మొదలెట్టారు. ఇప్పుడీ యువ మహిళా నిర్మాత గాయనిగా అవతారమెత్తారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా సంగీతదర్శకత్వంలో ఇప్పటికే రెండు పాటలను  పాడినట్లు ఐశ్వర్య తెలిపారు. తన గానం యువన్ ను చాలా ఇంప్రెస్‌ చేసిందని చెప్పారు. గాయనిగా తనను ప్రోత్సహిస్తున్న యువన్ శంకర్‌రాజాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కూటన్ అనే తమిళ సినిమా కోసం ఐశ్వర్య రెండు పాటలు పాడారు. ఇకపై తాను గాయనిగానూ కొనసాగుతానంటున్నారు ఐశ్వర్య.

మరిన్ని వార్తలు