శంకర్, కమల్ ల సీక్వెల్

8 Nov, 2015 09:15 IST|Sakshi

కమల్ హాసన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా భారతీయుడు. అవినీతి, లంచగొండితనం మీద తెరకెక్కించిన ఈ సినిమాకు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటినుంచి భారతీయుడు సినిమాకు సీక్వల్ ను రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నారు చిత్రయూనిట్. అయితే సరైన కథా కథనాలు దొరక్క ఈ సీక్వల్ ఆలస్యం అవుతూ వచ్చింది.

శంకర్ తో పాటు, కమల్ కూడా తన సినిమాలతో బిజీగా ఉండటంతో దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. ఈ సినిమా నిర్మించాడానికి ప్రయత్నాలు చేస్తున్న నిర్మాత ఏఎం రత్నం కూడా కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అందుకే భారతీయుడు సీక్వల్ కు సంబంధించిన వార్త చాలారోజులుగా ఇండస్ట్రీలో వినిపించలేదు. తాజాగా అజిత్ హీరోగా వేదలం సినిమాను నిర్మించిన రత్నం మరోసారి భారతీయుడు సీక్వల్ ను తెర మీదకు తీసుకువచ్చాడు.

వేదలం సినిమాను దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ హీరోగా తెరకెక్కుతున్న రోబో 2 పనుల్లో బిజీగా ఉన్న శంకర్ ఆ సినిమా పూర్తయిన తరువాత భారతీయుడు సీక్వల్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది.