-

అగ్రతారల బాటలో..

16 Aug, 2018 08:00 IST|Sakshi

తమిళసినిమా: సంచలనాలకు మరో పేరు అమలాపాల్‌ అని చెప్పవచ్చునేమో. సాధారణంగా వివాదాస్పద విషయాలతో చాలా మంది పేరును చెడగొట్టుకోవడమో, అవకాశాలను కోల్పోవడమో జరుగుతుంది. కానీ అమలాపాల్‌ విషయం వేరు. ఏదో సంఘటనతో వార్తల్లో ఉండే ఈ కేరళాకుట్టికి అవి తన కేరీర్‌కు మేలు చేస్తుంటాయి. ఆ విధంగా ఈ అమ్మడు లక్కీ అనే చెప్పాలి. మైనా చిత్రంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అమలాపాల్‌ ఆ తరువాత గ్లామర్‌కు మారిపోయింది. అయితే అమ్మ కణక్కు వంటి చిత్రాల్లో యుక్త వయసు కూతురికి అమ్మగా నటించి నటిగా తానేమిటో మరోసారి చూటుకుంది. వివాహానంతరం నటనకు దూరంగా ఉన్నా, వివాహ రద్దు తరువాత మళ్లీ నటించడం మొదలెట్టినా, ఆమె నటన దాహాన్ని తీర్చే కథా చిత్రం అమరలేదు.

అయితే తాజాగా అలాంటి అవకాశం అమలాపాల్‌ ఇంటి తలుపు తట్టింది. అగ్ర తారలు నయనతార, అనుష్క వంటి వారు ఒక పక్క కమర్షియల్‌ కథా చిత్రాల్లో నటిస్తూనే మరో పక్క హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలను నటిస్తూ తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. తాజాగా అమలాపాల్‌కు అలాంటి అవకాశం వరించింది. ఇంతకుముందు తొలి చిత్రం మేయాదమాన్‌తోనే సక్సెస్‌ను అందుకున్న యువ దర్శకుడు రత్నకుమార్‌ రెండో ప్రయత్నానికి సిద్ధం అయ్యారు. ఆయన తన మలి చిత్రాన్ని హీరోయిన్‌ సెంట్రిక్‌ కథను తయారు చేసుకున్నాడు. ఇందులో అమలాపాల్‌ను కథానాయకిగా ఎంచుకోవడం విశేషం. దీనికి ఆయన ఆడై అనే టైటిల్‌ నిర్ణయించారు. ఈ చిత్రం గురించి రత్నకుమార్‌ తెలుపుతూ ఈ చిత్రం పూర్తి విభిన్నంగా, హృదయాన్ని టచ్‌ చేసే పాయింట్‌తో కూడిన ఫన్‌ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని చెప్పారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని, షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ చిత్రానికి విజయ్‌కార్తీక్‌ కన్నన్‌ ఛాయాగ్రహణ, ప్రదీప్‌కుమార్‌ సంగీతం అందించనున్నారు. మొత్తం మీద నటి అమలాపాల్‌ టైమ్‌ బాగుందన్నమాట.

మరిన్ని వార్తలు