మనమెంత చెప్పినా..!

11 Jul, 2019 09:00 IST|Sakshi

చెన్నై : విమర్శలతో రాటు తేలిన నటి అమలాపాల్‌ అని పేర్కొనవచ్చు. అందుకేనేమో అలాంటి విమర్శకులను అస్సలు పట్టించుకోనంటోంది. అంతే కాకుండా ఈ మలయాళీ భామకు కాస్త ధైర్యం ఎక్కువే. విమర్శించే వారిని తనదైన భాణిలో ధీటుగానే బదులిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన ఆడై చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ చిత్రంలో అమలాపాల్‌ పోషించిన పాత్ర గురించే ఇప్పుడు చర్చంతా. కారణం ఇందులో అమలాపాల్‌ పూర్తి నగ్నంగా నటించిన సన్నివేశాలు చోటు చేసుకోవడమే. అలా నటించినందుకు కొందరు విమర్శించినా, ఆమె ధైర్యానికి చాలా మంది అభినందిస్తున్నారు. అమలా పాల్‌ నగ్నంగా నటించిన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చిత్ర యూనిట్‌కు చెందిన నమ్మకమైన 15 మందిని మాత్రమే సెట్‌లో ఉండేలా జాగ్రత్త పడ్డారట. వారి నుంచి కూడా సెల్‌ఫోన్లను తీసుకుని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తరువాతనే తిరిగి ఇచ్చేవారట.

దీని గురించి అమలాపాల్‌ తెలుపుతూ తాను నగ్నంగా నటించే సన్నివేశాల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరించవచ్చునని నిర్మాత అన్నారని, అయితే ఆ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పానని అంది. అప్పుడలా అన్నా, నగ్న సన్నివేశాల చిత్రీకరణ రోజున షూటింగ్‌కు బయలుదేతున్నప్పుడే కాస్త దడ పుట్టిందని చెప్పింది. సెట్‌లో ఎం జరుగుతుందో? ఎవరెవరు ఉంటారో, తగిన రక్షణ ఉంటుందా? లాంటి అన్న భయం కలిగిందని చెప్పింది. అయితే ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో యూనిట్‌ సభ్యులు 15 మంది మాత్రమే ఉండటం చూసి కాస్త మనసు కుదుట పడిందని చెప్పింది. వారిపై ఉన్న నమ్మకంతోనే ధైర్యంగా ఆ సన్నివేశాల్లో నటించినట్లు అమలాపాల్‌ చెప్పింది. కాగా అమలాపాల్‌ అలా నగ్నంగా నటించడాన్ని కొందరు తప్పుగా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు స్పందించిన ఆమె విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారని, మనం వివరణ ఇచ్చినా సరే వారికి కావలసింది మాత్రమే చెవిన వేసుకుంటారని అంది. అందువల్ల అలాంటి వారిని అస్సలు పట్టించుకోరాదని పేర్కొంది. ఇన్ని విమర్శలను మూట కట్టుకున్న ఆడై చిత్రం ఈ నెల 19వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.

మరిన్ని వార్తలు