శవాలతో సావాసం!

3 Apr, 2019 02:37 IST|Sakshi
అమలాపాల్‌

ట్రావెలింగ్‌ను బాగా ఇష్టపడే అమలాపాల్‌ ఇటీవల హాస్పిటల్స్‌ చుట్టూ తెగ తిరుగుతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్‌లో ఆమె ఎక్కడికి వెళుతున్నారంటే? శవాలను భద్రపరిచే మార్చురీలోకి అట. ఇదంతా ఆమె కథానాయికగా నటిస్తున్న నెక్ట్స్‌ తమిళం చిత్రం ‘కడవేర్‌’ కోసమే. ఈ సినిమాలో ఫోరెన్సిక్‌ పాథాలజిస్ట్‌  పాత్రలో నటిస్తున్నారు అమలపాల్‌. పాత్ర ప్రిపరేషన్‌లో భాగంగానే ఆమె హాస్పిటల్స్‌కి వెళ్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రంతో అనూప్‌ ఫణిక్కర్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇంకా స్పెషల్‌ ఏంటంటే.. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు అమలాపాల్‌. సోమవారం షూటింగ్‌ ఆరంభమైంది. కేరళ పోలీస్‌శాఖకు చెందిన ఫోరెన్సిక్‌ సర్జన్‌ బి. ఉమాదతాన్‌ నిజజీవితంలో ఎదురైన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. ‘‘ఈ సినిమాలో పాథాలజిస్ట్‌గా నటిస్తున్నాను. మర్డర్‌మిస్టరీ నేపథ్యంలో ఉంటుంది. నేనింతవరకు ఇలాంటి పాత్ర చేయలేదు. చాలెంజింగ్‌గా అనిపిస్తోంది.

చాలా రీసెర్చ్‌ చేస్తున్నాను. ఇంటర్‌నెట్‌లో బాగా వెతికాను. ఉమాదతాన్‌తో కూడా మాట్లాడాను’’ అని అన్నారు. అంటే ఈ పాత్ర కోసం అమలా పాల్‌ శవాలతో సావాసం చేస్తున్నారన్నమాట. ఇక నిర్మాతగా మారడం గురించి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ నా దగ్గరకు 4 ఏళ్ల క్రితం వచ్చింది. అనూప్‌ అండ్‌ టీమ్‌ గత మూడేళ్లుగా వర్క్‌ చేస్తున్నారు. డిఫరెంట్‌గా ఉండే ఇలాంటి సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలో నేను సంపాదించినదాన్ని ఇండస్ట్రీలోనే పెడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు అమలాపాల్‌.

మరిన్ని వార్తలు