మూడో కన్ను తెరిపించాడు..!

18 Jul, 2019 08:26 IST|Sakshi

సినిమా: ఆయన తన మూడో కన్ను తెరిపించాడు అంటోంది నటి అమలాపాల్‌. ఈ అమ్మడు ఏం చెప్పినా ఆసక్తిగా మారిందిప్పుడు. దర్శకుడు విజయ్‌ను 2014లో ప్రేమ వివాహం చేసుకుని, మూడేళ్లు తిరగకుండానే విడాకులు తీసుకుంది. ఆ తరువాత నటనపై దృష్టి సారించిన అమలాపాల్‌ తన చిత్రాలతో తరచూ వార్తల్లో ఉంటూనే ఉంది. కాగా ఇటీవల తన మాజీ భర్త విజయ్‌ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి మరోసారి వార్తల్లోకెక్కింది. కాగా ఇప్పుడు తనకూ మరో ప్రేమికుడున్నాడన్న విషయాన్ని బయట పెట్టి చర్చల్లో నానుతోంది. ఇటీవల తన కొత్త ప్రేమికుడితో పాండిచ్చేరిలో ఎంజాయ్‌ చేస్తోందట. దీని గురించి జరుగుతున్న ప్రచారంతో మండిపడుతున్న ఈ అమ్మడు తాను ఎవరితో కలిసుంటే మీకెందుకూ అని ప్రశ్నిస్తోంది.


అవును తానిప్పుడు ప్రేమ బంధంలో ఉన్నానని, ఆడై చిత్ర కథ విన్న సమయంలోనే అతనితో తన ప్రేమ గురించి చెప్పానని తెలిపింది.  తాను మారడానికి తనే కారణం అని చెప్పింది. కన్నతల్లి మాత్రమే హద్దులు లేని ప్రేమను కరిపించగలదని అంది. అయితే అవన్నీ తానూ చేయగలనని అతను నిరూపించాడని చెప్పింది. తన కోసం అతని పని కూడా పక్కన పెట్టాడని, సినిమాపై తనకున్న ఆసక్తిని తను బాగా అర్థం చేసుకున్నాడని పేర్కొంది. తన చిత్రాలను చూసి చాలా భయంకరమైన నటినని అంటుంటాడని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తన మూడో కంటిని తెరిపించింది అతనేనని అంది. నటీమణులది రక్షణ లేని పరిస్థితి కావడంతో తమను అభినందించేవారినే పక్కన ఉంచుకుంటుంటారంది. అయితే తన చుట్టూ ఉన్నవారు నిజాలు చెప్పే పరిస్థితి లేదని అంది. అలాంటి అతను తన జీవితంలోకి ప్రవేశించి తనలోని తప్పుల గురించి తెలియజేశాడని చెప్పింది. ఇప్పుడు తన జీవితంలో నిజం అంటే అతనేనని చెప్పుకొచ్చిన అమలాపాల్‌ అతనెవరన్నది మాత్రం బయటపెట్టలేదు.

మరిన్ని వార్తలు