ఇక బుల్లితెరపై డాక్టర్ అమల!

14 Jul, 2014 11:39 IST|Sakshi
ఇక బుల్లితెరపై డాక్టర్ అమల!

అక్కినేని నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ బుల్లితెర మీదకు రంగ ప్రవేశం చేసి కొన్ని వారాలు గడిచిందో, లేదో గానీ.. అప్పుడే ఆయన భార్య అమల కూడా మళ్లీ మేకప్ వేసుకుని బుల్లితెర మీదకు వస్తున్నారు. భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ.. టీవీ సీరియళ్లలోకి రాబోతున్నారు. అయితే, నాగార్జున తెలుగులో షో చేస్తుంటే అమల మాత్రం తమిళ టీవీ సీరియల్ను ఎంచుకున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అమల.. తాను ఓ తమిళ సీరియల్లో డాక్టర్ పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు.

''ఉయెర్మి అనే ఈ సీరియల్ షూటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఇందులో నేను డాక్టర్ పాత్ర పోషిస్తున్నాను. ఇప్పటివరకు జీవితంలో చాలా పాత్రలు పోషించాను. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాలు, టీవీ సీరియళ్లలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీరియల్ విషయానికే వస్తే, దీని స్క్రిప్టు చాలా అద్భుతంగా ఉంది. ఈ పాత్ర గురించి స్క్రిప్టు తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు కాదని ఏమాత్రం చెప్పలేకపోయాను. మొత్తం కథ అంతా 12 మంది వైద్యులు, వాళ్ల జీవితాలు, కుటుంబాలు, రోగుల చుట్టూ తిరుగుతుంటుంది. బహుశా ఆగస్టు రెండోవారం తర్వాత ఇది ప్రసారం కావచ్చు'' అని అమల తెలిపారు.