డబుల్‌ ధమాకా

13 Aug, 2018 00:35 IST|Sakshi
రవితేజ, నాగచైతన్య

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థ ప్రతినిధులు నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవి శంకర్‌ సినీ లవర్స్‌కు ఒకే రోజు డబుల్‌ ధమాకా ఇచ్చారు. రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, నాగచైతన్య ’సవ్యసాచి’ సినిమాల విడుదల తేదీలను ఒకే రోజున అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు. ‘‘ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మా బ్యానర్‌లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం మంచి హిట్‌ సాధించింది. మా సక్సెస్‌ఫుల్‌ జర్నీలో భాగస్వాములైన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

మీరు ఇచ్చిన ఈ విజయాలు మా బాధ్యతను మరింత పెంచుతున్నాయి. అలాగే మా సంస్థ నుంచి వస్తున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘సవ్యసాచి’ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమాను అక్టోబర్‌ 5న, నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాను నవంబర్‌ 2న విడుదల చేయబోతున్నాం’’ అని పేర్కొన్నారు మైత్రీమూవీ మేకర్స్‌ ప్రతినిధులు.

మరిన్ని వార్తలు