క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా తిలకిస్తున్న ఐసీసీ వరల్డ్కప్లోని వివిధ మ్యాచ్లకు వరణుడు అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే నాలుగు మ్యాచ్లు వర్షార్పణమయ్యాయి. దీంతో ఐసీసీ తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక క్రికెట్ను అమితంగా ఆరాధించే టీమిండియా ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గురువారం న్యూజిలాండ్తో జరగాల్సిన మ్యాచ్ రద్దవ్వడంతో వారి ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి.
ఈ క్రమంలో... ‘ఏ కాలంలో మ్యాచ్లు నిర్వహించాలో తెలియని ఐసీసీకి.. ధోని గ్లోవ్స్పై రాద్దాంతం చేయడం మాత్రం తెలుసు. సిగ్గుపడాలి’ అంటూ #ShameOnICC హ్యాష్ట్యాగ్తో ఐసీసీ తీరుపై మండిపడుతున్నారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘ వరల్డ్కప్ వేదికను భారత్కు మార్చండి. మాకు వర్షాల అవసరం ఎంతగానో ఉంది’ అంటూ చమత్కరించారు. నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న భారత ప్రజలకు.. వరల్డ్కప్- వర్షం సెంటిమెంట్ కారణంగా కాస్తైనా ఉపశమనం లభిస్తుందనే ఉద్దేశంతో తనదైన శైలిలో ట్వీట్ చేశారు. కాగా వరణుడి కారణంగా కివీస్తో మ్యాచ్ రద్దవ్వడం పట్ల టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాటింగ్హామ్లో కాకుండా.. కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్రలో వర్షం పడాలని అతడు ఆకాంక్షించాడు.
shift the tournament WC 2019 to India .. we need the rain .. !!! 🤣🤣🤣 https://t.co/KcGAAEODyr
— Amitabh Bachchan (@SrBachchan) June 13, 2019