గురువు సాక్షిగా యాగం

31 Mar, 2018 00:23 IST|Sakshi
అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవి, నయనతార

పెద్దల ఆశీర్వాదంతో సమానమైన బహుమతి మరొకటి లేదు. వారి అనుమతితో, వారి సాక్షిగా పని మొదలుపడితే విజయం తథ్యం. అందుకే గురువు సాక్షిగా యాగం చేస్తున్నారు నరసింహా రెడ్డి. మరి యాగం చేయాల్సిన పరిస్థితులు ఏంటి? యాగ ఫలితం ఏంటి? అన్న విషయాలను మాత్రం సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాల్సిందే. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ౖ‘సెరా’. ఇందులో నయనతార కథానాయిక. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ‘‘చిరంజీవిగారితో వర్క్‌ చేయడం గౌరవంగా ఉంది. జాయ్‌ఫుల్‌గా షూటింగ్‌ జరుగుతోంది’’ అని యాగం చేస్తున్న చిరంజీవి, నయనతార ఫొటోలను ట్వీటర్‌లో షేర్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌. అంతేకాదు.. సినిమాలో తన ఒరిజినల్‌ లుక్‌ను కూడా రివీల్‌ చేశారు. ఇందులో నరసింహారెడ్డి గురువు పాత్రను అమితాబ్‌ చేస్తున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని టాక్‌.

మరిన్ని వార్తలు