అమితాబ్‌, అభిషేక్‌లకు కరోనా

12 Jul, 2020 12:34 IST|Sakshi

ట్విట్టర్‌లో ప్రకటించిన బిగ్‌ బీ

ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరిక

కుమారుడు అభిషేక్‌కు కూడా పాజిటివ్‌

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం సాయంత్రం అమితాబ్‌ బచ్చన్‌ ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పి రేటరీ ఐసోలేషన్‌ యూనిట్‌లో చేరారు. అంతకు ముందు అమితాబ్‌ ట్విట్టర్‌లో.. ‘నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి అధికారులు నాతోపాటు మా కుటుంబ సభ్యులు, సిబ్బందికి కూడా పరీక్షలు చేయించారు. వారికి సంబం ధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది’ అని అందులో వివరించారు. ‘గత 10 రోజులుగా నాతో సన్నిహి తంగా మెలిగిన వారిని కూడా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను’ అని అందులో తెలిపారు. 

కోవిడ్‌ లక్షణా లతో అమితాబ్‌ ఆస్పత్రిలో చేరారనీ, అంతకు ముందు నుంచే అమితాబ్‌ తన నివాసంలోనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారనీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మార్చి 25న మొదలైన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయం నుంచి ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు. ఇటీవల తన ఇంట్లోనే కౌన్‌ బనేగా కరోడ్‌ పతి కార్యక్రమం ప్రమోషనల్‌ కాంటెంట్‌ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సిబ్బంది ద్వారానే ఆయనకు కరోనా వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, అమితాబ్‌ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు కూడా తనకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

కాసేపటికే అభిషేక్‌ (44) కూడా తనకు పాజిటివ్‌ అని ధ్రువీకరించారు. ‘మా ఇద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాం. సంబంధిత అధికారులందరికీ సమాచారమం దించాం. అభిమానులెవరూ కూడా ఆందోళన చెందవద్దని కోరుతున్నాను.. ధన్యవాదాలు’ అని అభిషేక్‌ వెల్లడించారు. కాగా, జయాబచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌లకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. దీంతో అమితాబ్‌ కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కాస్త ఊరట చెందారు.  


 
వైద్యులేమంటున్నారు...
శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న అమితాబ్‌ నాలుగు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చి, కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ పరీక్ష ఫలితం శనివారం సాయంత్రం అందింది. ప్రస్తుతానికి ఆయనకు వెంటిలేటర్‌ను అమర్చలేదు. కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన విషయం ఆయనే స్వయంగా అభిమానులకు తెలుపుతానన్నారు. అందుకే మేం ఈ విషయమై ఎటువంటి ప్రకటనా చేయలేదు. అమితాబ్‌ విషయంలో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఒకటి ఆయన వయస్సు. రెండోది, ఆయన కాలేయ, ఉదర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుండటం. అయితే, సరైన వైద్య, చికిత్సలతో ఆయన త్వరగా కోలుకుంటారని విశ్వాసం ఉంది.

1982లో ‘కూలీ’ చిత్ర షూటింగ్‌ సమయంలో తీవ్ర ప్రమాదానికి గురైన అమితాబ్‌.. అప్పటి నుంచి కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణ, సూచనలకు అనుగుణంగా ఆయన రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆయన నటించిన చెహరే, బ్రహ్మాస్త్, ఝండ్‌ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. అమితాబ్‌ చివరగా షూజిత్‌ సిర్కార్‌ కామెడీ సినిమా ‘గులాబో సితాబో’లో ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి నటించారు. ఈ సినిమా కోవిడ్‌–19 ఆంక్షల దృష్ట్యా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది కూడా. వీటితోపాటు కౌన్‌ బనేగా కరోడ్‌ పతి కార్యక్రమం 12వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. కాగా, అమితాబ్‌ త్వరగా కోలుకోవాలంటూ బాలీవుడ్‌కు చెందిన పలువురు ట్విట్టర్‌ ద్వారా ఆకాంక్షించారు.  

మరిన్ని వార్తలు