యూక్షన్‌కు రెడీ

26 Feb, 2014 00:45 IST|Sakshi
 తదుపరి యాక్షన్ అవతారానికి రెడీ అవుతున్నట్లు నటి ఎమీ జాక్సన్ చెప్పారు. మదరాసు పట్టణం చిత్రం ద్వారా గ్లామర్ డాల్‌గా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ లండన్ బ్యూటీ ఆ చిత్రంలో ఇంగ్లీష్ భామగా అధిక శాతం ఆంగ్లంలోనే ముద్దు ముద్దుగా మాట్లాడి కుర్రకారు మనసులు దోచుకున్నారు. ఆ తరువాత విక్రమ్ సరసన తాండవం చిత్రంలో నటించారు. ఆ చిత్రం పరాజయం పాలయినా ఎమీ జాక్సన్ మాత్రం స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే గోల్డెన్ ఛాన్స్‌ను దక్కించుకున్నారు. అదే ఐ చిత్రం. ఇందులోను ఆమె హీరో విక్రమ్ కావడం విశేషం. తన కెరీర్‌లో ఇది మైల్ స్టోన్ చిత్రం అంటున్న ఎమీ జాక్సన్ ఐ చిత్ర అనుభవాలను, తదుపరి చిత్రాల వివరాలను వెల్లడించింది. 
 
 శంకర్ లాంటి బ్రిలియంట్ దర్శకుడితో తన మూడవ తమిళ చిత్రం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ కోసం చైనాతోపాటు భారత దేశంలోని పలు ప్రాంతాలు చుట్టొచ్చానన్నారు. ఈ చిత్రంలో తన నటన ఎల్లలను మీటిందన్నారు. అందుకు కారణం శంకర్ అని పేర్కొన్నారు. ఐ చిత్రంలో తన పాత్ర పేరు దివ్య అని తెలిపారు. ఈ పాత్రకు తమిళ సంభాషణలు చాలా ఉంటాయన్నారు. ఈ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించానని, ఎందుకంటే ఇంతకు ముందు చిత్రాల్లో సగం ఇండియన్ పాత్రలనే ధరించానని ఐ చిత్రంలో పూర్తిగా తమిళ అమ్మాయిగా నటించినట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం రెండేళ్లు పని చేశానని మధ్యలో ఏ ఇతర చిత్రం చెయ్యలేదని తెలిపారు. అందుకు కారణం ఐ చిత్రం తన కెరీర్‌లో బిగ్గెస్ట్ చిత్రం అని పేర్కొన్నారు. అందుకే పూర్తిగా ఈ చిత్రానికే అంకితమయ్యానని చెప్పింది. 
 
 ప్రపంచంలోనే దిబెస్ట్
 దర్శకుడు శంకర్ గురించి చెప్పాలంటే అమెరికా, న్యూజిలాండ్‌తో సహా ప్రపంచంలోనే ది బెస్ట్ ఫ్రొఫెషనల్ దర్శకుడాయన అని వ్యాఖ్యానించారు. పోటీతత్వంతో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశామని చెప్పారు. టాకీ పార్ట్ పూర్తి అయ్యిందని చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని తెలిపారు. తనపై ఒక సాంగ్‌ను చిత్రీకరించాల్సి ఉందని, అది తన పరిచయ గీతం అని వివరించారు. ఈ పాటను వచ్చే నెలలో చెన్నైలో చిత్రీకరించనున్నారని తెలిపారు.
 
 విక్రమ్‌తో పోటీ
 ఐ చిత్రం కోసం అందరం పోటీపడి నటించి బెస్ట్ అవుట్‌పుట్ రావడానికి కృషి చేశామన్నారు. మీరు విక్రమ్‌తో పోటీపడి నటించారా? అన్న ప్రశ్నకు చిరునవ్వు నవ్వి విక్రమ్‌కు ధీటుగా నటించానా? అన్నది చెప్పలేను కానీ నిజానికి ఆయనతో పోటీ పడాలంటే మరో పదేళ్ల అనుభవం అవసరం అవుతుందన్నారు. 20 ఏళ్ల నటనానుభవం గల గొప్ప నటుడు విక్రమ్ అని పొగడ్తల వర్షం  కురిపించారు. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని ఐ చిత్రంలో తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశానని అన్నారు. దర్శకుడు శంకర్ తనకు కావలసిన విధంగా తమను మౌల్డ్ చేసుకున్నారని చెప్పారు. తదుపరి చిత్రాల కథలు వింటున్నానని తెలిపారు. తెలుగులో తాను నటించిన ఎవడు చిత్రం విజయం సాధించిందని అక్కడ కూడా అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. తదుపరి చిత్రంలో యాక్షన్ హీరోయిన్‌గా అవతారం ఎత్తాలని భావిస్తున్నట్లు ఎమీ జాక్సన్ పేర్కొన్నారు.