ఆనందమానందమాయె

10 Jul, 2018 00:34 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌

మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌. ఈ ఏడాది మేలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాతో ఆమె వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వ్యాపార వ్యవహారాల రీత్యా సోనమ్‌ భర్త ఆనంద్‌ ఢిల్లీలో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేయాల్సి వస్తోందట. దీంతో పెళ్లైన తర్వాత ఢిల్లీకి సోనమ్‌ రాకపోకలు బాగా పెరిగాయి. అలాగే లండన్‌లోనూ ఆనంద్‌కి వ్యాపారాలు ఉన్నాయట. అప్పుడప్పుడూ  భర్తతో టైమ్‌ స్పెండ్‌ చేయడం కోసం లండన్‌ కూడా వెళ్తున్నారట సోనమ్‌. దీంతో సోనమ్‌ కోసం ఆనంద్‌ తన వ్యాపారాలను ముంబైలో కూడా పెంచాలని అనుకుంటున్నారట.

ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నది బీటౌన్‌ టాక్‌. అలాగే సోనమ్‌ కూడా మూడేళ్ల క్రితం దాదాపు 30 కోట్లతో బాంద్రాలో కొన్న తన ఇంటిని రీ డిజైన్‌ చేయిస్తున్నారని బాలీవుడ్‌ సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఈ ఇంటి డిజైనింగ్‌ కంప్లీట్‌ అవుతుందని, ముంబైలో ఉన్నప్పుడు వీరిద్దరూ ఈ ఇంట్లోనే ఉండబోతున్నారనేది బాలీవుడ్‌ కథనాల సారాంశం. ఆనంద్‌ని పెళ్లి చేసుకున్నాక సోనమ్‌ లైఫ్‌ ఇంకా ఆనందంగా మారిందని పరిశీలకులు అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. .‘జోయా ఫ్యాక్టర్‌’, ‘ఏక్‌ లడకీ కో దేఖాతో ఏసా లగా’ సినిమాలతో బిజీగా ఉన్నారు సోనమ్‌.

మరిన్ని వార్తలు