అసభ్యకరమైన ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి

26 Jan, 2018 16:10 IST|Sakshi

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ దేశంలో మహిళలకు ఎలాంటి గౌరవం లేదని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఓ మహిళగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాని అందులో పేర్కొన్నారు. 

‘ప్రియమైన భారతదేశం.. నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి కుమార్తెగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. నేను చేసే పని, వేసుకునే దుస్తులు నా కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. అయితే పక్కవాళ్లు వీటిని వేలెత్తి చూపుతున్నారు. నా కుటుంబాన్ని, నన్ను అగౌరవపరిచే హక్కు వారికి  ఎక్కడ ఉంది? ప్రతి రోజూ అసభ్యకరమైన ఫోన్‌ కాల్స్‌, సోషల్‌మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఓ బాధ్యతగల మహిళగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నాకు నచ్చిన పనిని స్వేచ్ఛగా చేయలేకపోతున్నాను. స్వేచ్ఛ అంటే ఇదేనా? కొందరు వ్యక్తులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో నా ఆశల్ని అణచి వేయాలనుకుంటున్నారు. ఇవన్నీ అనుభవిస్తూ బతకాలా? ఈ విషయంలో మనం ఏమీ చేయలేమా?’  అని అనసూయ ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు.

గతంలో  అనసూయ 'అసభ్యత, అశ్లీలత గురించి నేను ఏదైనా విషయం చెప్పినా, మాట్లాడినా.. బట్టలు సరిగా వేసుకోవాలంటారు. పోనీ కామెడీని కామెడీగా తీసుకుంటే మంచిదని చెబితే.. అర్జున్ రెడ్డి అంటారు. ఏందివయ్యా.. దిమాగ్ ల అటుది ఇటు.. ఇటుది అటు ఉందా' అంటూ ట్వీట్ చేశారు. పిచ్చి పిచ్చి రాతలు, కామెంట్స్, పోస్టులు చేసేవాళ్లను బ్లాక్‌ చేస్తానని అనసూయ గతంలో అన్నారు.  
 

మరిన్ని వార్తలు