నగరంలో ‘రంగమ్మత్త’ సందడి

2 Jun, 2018 12:30 IST|Sakshi

సీతంపేట: రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త క్యారెక్టర్‌లో ఒదిగిపోయి సినీ ప్రేక్షకుల మది దోచుకున్న అనసూయ భరద్వాజ్‌ శుక్రవారం సాయంత్రం నగరంలో సందడి చేశారు. గురుద్వార కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘మగువ’ బొటిక్‌ను ఆమె ప్రారంభించారు. అక్కడ డిస్‌ప్లే చేసిన కలెక్షన్‌ తిలకించిన అనంతరం మాట్లాడుతూ బొటిక్‌లో శారీస్, చుడీదార్స్, హ్యాండ్‌లూమ్‌ కలెక్షన్, హ్యాండ్‌బ్యాగ్స్, టాప్స్‌ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. హైదరాబాద్‌ తర్వాత వైజాగ్‌ తనని బాగా ఎక్సైట్‌ చేసే ప్రదేశమని, అందుకే విశాఖ అంటే చాలా ఇష్టమని చెప్పారు.

‘అమ్మో’ చెప్పను
ప్రస్తుతం 5సినిమాలతో బాగా బిజీ గా ఉన్నానని అనసూయ చెప్పారు. ఎవరితో నటిస్తున్నారని అడగ్గా అమ్మో... చెప్పనని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇద్దరు ప్రముఖ డైరెక్టర్ల వద్ద సినిమాలు చేశానని, మరో ముగ్గురు దర్శకుల వద్ద సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ దర్శకుల పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు.

నా భర్తే ఫేవరెట్‌ హీరో
ఏ హీరో ఇష్టమని అడగ్గా తన భర్త భరద్వాజ్‌ ఇష్టమని సమాధానమిచ్చారు అనసూయ. తనకు డ్రీమ్‌రోల్‌ అంటూ ఏమీ లేదని, రంగమ్మత్తలా మంచి క్యారెక్టర్స్‌తో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందన్నారు. హీరోయిన్‌కు తానేమీ తక్కువ కాదని, ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళ హీరోయిన్‌ అంటూ తెలివిగా సమాధానమిచ్చారు. నా కోసం నిరీక్షిస్తున్న వారిని చూసి వైజాగ్‌లో నాకు చాలా మంది అభిమానులున్నారని ఈ రోజే తెలిసిందని మురిసిపోయారు.

రంగమ్మత్తగా గుర్తింపు ఆనందాన్నిచ్చింది
రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్‌తో మంచి పేరు వచ్చిందని, ఎక్కడకు వెళ్లినా రంగమ్మత్త అని పిలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనసూయ. జబర్దస్త్‌ షోలో ఒకలా, రంగస్థలం సినిమాలో మరొకలా ఉన్నానని, ఇపుడు చాలా మంది తనను ప్రత్యేకంగా చూడటానికి ఆహ్వానిస్తుండటం సంతోషంగా ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు