అనసూయను ట్రోల్‌ చేసి పడేశారు

19 Jul, 2018 12:32 IST|Sakshi

యాంకర్‌ కమ్‌ నటి అనసూయ భరద్వాజ్‌కు సోషల్‌ మీడియాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ట్రాఫిక్‌ సిగ్నల్‌లో వీడియో చూస్తున్న ఓ వ్యక్తి వీడియోను పోస్ట్‌ చేసి ఆమె ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అసలు విషయంలోకి వస్తే... బుధవారం సాయంత్రం అనసూయ.. బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 2లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆమె ప‌క్క‌ కారులో డ్రైవింగ్‌ సీట్లో ఉన్న  వ్యక్తి.. చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్‌లో వీడియో చూస్తున్నాడు. ఆ స‌న్నివేశాలను అన‌సూయ త‌న ఫోన్‌లో బంధించి హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

‘డియ‌ర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు నన్ను భయ‌పెట్టిస్తున్నాయి. ఇంత‌కు ముందు వేరే వారి త‌ప్పిదం వ‌ల‌న నేను ప్ర‌మాదానికి(గతేడాది మే నెలలో గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం జరిగి.. అనసూయకు గాయాలు అయ్యాయి కూడా) గుర‌య్యాను. ద‌య చేసి ఇలాంటి నిర్ల‌క్ష్య‌పు డ్రైవ‌ర్స్‌ని వ‌దలొద్దు.రోడ్లపైకొచ్చి త‌మ‌కిష్ట‌మొచ్చిన‌ట్టు డ్రైవ్ చేసే వారికి.. ఇత‌రుల ప్రాణాలంటే లెక్క‌లేదా? అని అన‌సూయ త‌న ట్వీట్‌లో తెలిపారు. అయితే ఆ వీడియో  సందేశం తేడా కొట్టేసింది. చీప్‌ పబ్లిసిటీ స్టంట్‌ ఆమెను ట్రోల్‌ చేస్తూ పలువురు రీట్వీట్లు చేశారు. 

దీంతో అసంతృప్తి వెల్లగక్కిన నెటిజన్లు వరుస ట్వీట్లు చేశారు. ‘మంచి కారణంతో ఓ వీడియో పెడితే ట్రోల్‌ చేస్తున్నారు. అయినా ఫర్వాలేదు. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది సరైన పనే’ అంటూ మరో ట్వీట్‌ చేశారు. ఇక అక్కడి నుంచి మరికొందరు సైతం ఆమెపై విరుచుకుపడుతుండగా.. వారికి ఓపికగా వివరణలు ఇస్తూ సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. దిగి చెప్పే యత్నం చేయొచ్చు కదా అన్న ఓ వ్యక్తి ప్రశ్నకు.. అలా చేస్తే తర్వాత యూట్యూబ్‌ల్లో ఎలాంటి హెడ్డింగులు కనిపించేవో అందరికీ తెలుసంటూ అనసూయ బదులిచ్చారు. కొన్నిరోజుల క్రితం విరుష్కలు కూడా ఇదే తరహాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. (అనసూయపై ఫిర్యాదు)

మరిన్ని వార్తలు