రాజ్‌కుమార్ కిడ్నాపైన గెస్ట్‌హౌస్‌లో అధిరన్

17 Oct, 2016 02:22 IST|Sakshi
రాజ్‌కుమార్ కిడ్నాపైన గెస్ట్‌హౌస్‌లో అధిరన్

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ కిడ్నాప్ చేసిన గెస్ట్‌హౌస్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం అధిరన్ అని ఆ చిత్ర దర్శకుడు జేవీ.మోహన్ తెలిపారు. దర్శకుడు కస్తూరిరాజా, కేఎస్.రవికుమార్,పార్తిబన్, అశోక్ వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవంతో జేవీ.మోహన్ మెగాఫోన్ పట్టి తెరపై ఆవిష్కరించిన చిత్రం అధిరన్. పి.మూవీస్, స్మార్ట్ అచీవర్స్ స్క్రీన్ సంస్థల అధినేతలు రాజ్, సురేశ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నిర్మాతల్లో ఒకరైన సురేశ్‌కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.ఆయనకు జంటగా మలయాళ నటి అంజనా నాయకిగా పరిచయం అవుతున్నారు.
 
  ఈ చిత్రానికి చాయాగ్రహణం మహేశ్, సంగీతాన్ని రఘు, జైల ద్వయం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ కళాశాలలో చదువుతున్న హీరో ప్రాణ మిత్రుడి కుటుంబం అప్పుల బాధకు గురవుతుందన్నారు.దీంతో హీరో వారి అప్పును తాను తీరుస్తానని రుణం ఇచ్చిన వారికి హామీ ఇస్తాడన్నారు. అయితే అనుకున్న సమయానికి హీరో అప్పు చెల్లించకపోవడంతో తన మిత్రుడు కిడ్నాప్‌నకు గురవుతాడన్నారు.
 
 
  అతన్ని రక్షించడానికి బయలు దేరిన హీరో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు అన్నదే అధిరన్ చిత్ర ఇతివృత్తం అని వివరించారు. చిత్ర షూటింగ్‌ను కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన సత్యమంగళం ప్రాంతంలోని గెస్ట్‌హౌస్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రం అధిరన్ అని, ప్రత్యేక అనుమతితో అక్కడ షూటింగ్ నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు.స్నేహం,ప్రేమ,పోరాటం అంటూ కమర్శియల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రం అధిరన్ అని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.