పాతిక లక్షలకు ఆటా పాట

6 Feb, 2014 04:19 IST|Sakshi
పాతిక లక్షలకు ఆటా పాట
నటి ఆండ్రియా ఆటా పాట కావాలంటే పాతిక లక్షలు చెల్లించాల్సిందే. సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరు. ఆ మధ్య యువ సంగీత దర్శకుడితో రొమాన్స్ చేసిన దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో కలకలం సృష్టిం చాయి. అయితే ఈ వ్యవహారంలో నా జీవితం నా ఇష్టం అంటూ ఖరాఖండిగా ప్రకటించి తన ప్రవర్తనను సమర్థించుకున్న ఈ బ్యూటీ విశ్వరూపం చిత్రంలో కమలహాసన్‌తో జత కట్టింది. ఆ చిత్రం విజయంతో మరిన్ని అవకాశాలు వస్తాయని పారితోషికం కూడా పెంచేయవచ్చునని ఆండ్రియా ఆశించింది. అయితే ఈ అమ్మడి ఆశలు అడి ఆశలయ్యాయి. ఒక్క అవకాశం కూడా రాలేదు. మళ్లీ కమలహాసన్ విశ్వరూపం-2లో అవకాశం ఇచ్చారు.
 
 ప్రస్తుతం ఈ చిత్రం విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తోంది. విశ్వరూపం-2లో తన పాత్రకే అధిక ప్రాధాన్యత వుంటుందని, కమలహాసన్‌తో డ్యూయెట్ కూడా పాడినట్లు చెప్పింది. విశ్వరూపం-2 విడుదలానంతరం అయినా పారితోషికం పెంచడానికి తహతహలాడుతున్న ఆండ్రియాకు శశికుమార్ హీరోగా నటిస్తున్న బ్రహ్మన్ చిత్రంలో ఒక పాటకు ఆడే అవకాశం వచ్చింది. అయితే అందుకామె డిమాండ్ చేసిన పారితోషికం రూ.25లక్షలు. అంత పారితోషికం నిర్మాత ససేమిరా అంటే దర్శకుడు మాత్రం ఆ పాటకు ఆండ్రియా నటిస్తేనే బాగుంటుందని పట్టుపట్టారట. దీంతో చేసేదేమిలేక బ్రహ్మన్ చిత్ర నిర్మాత రూ.25 లక్షలు ఇచ్చి ఆండ్రియాతోనే పాట పాడించి ఆడించారట.  దీంతో సింగిల్ సాంగ్ అయినా ఓకే అంటుందట ఈ భామ.