‘తన రాకతో జీవితం పరిపూర్ణమైంది’

10 May, 2019 14:11 IST|Sakshi

బాలీవుడ్‌ జంట అంగద్‌ బేడి- నేహా దుఫియా వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా హ్యాపీ కపుల్‌కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి రోజును పురస్కరించుకుని వీరిద్దరు తమ ముద్దుల చిన్నారితో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నేహాతో తన అనుబంధం గురించి అంగద్‌ బేడీ మాట్లాడుతూ... ‘ గడిచిన ఏడాది ఎంతో హాయిగా సాగిపోయింది. పెళ్లి చేసుకుంటే జీవితం మారిపోతుంది. కష్టాలు మొదలవుతాయి(నవ్వుతూ) అంటూ చాలా మంది చెప్పారు. కానీ మా విషయంలో అలాంటివేమీ జరగడం లేదు. పెళ్లికి ముందు ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అంతే. ఇప్పటికీ మేమిద్దరం ప్రాణ స్నేహితులం. ప్రేమికులం. అంతేకాదు అందమైన కుటుంబాన్ని కలిగి ఉన్న అదృష్టవంతులం. నేహను జీవిత భాగస్వామిగా పొందడం ద్వారా నా జీవితం పరిపూర్ణమైంది’ అంటూ భార్యపై ప్రేమ కురిపించాడు.

మెహర్‌ దేవుడిచ్చిన వరం..
‘దేవుడి ఆశీస్సులతో ప్రస్తుతం మేము ముగ్గురం అయ్యాం. మా అనుబంధానికి గుర్తుగా మెహర్‌(కూతురు) మా జీవితంలోకి వచ్చింది. నిజానికి ఇప్పటికీ నేహాను నా గర్ల్‌ఫ్రెండ్‌లానే భావిస్తున్నా. తల్లిదండ్రులుగా బాధ్యతలను నెరవేరుస్తూనే మాకంటూ ఓ ప్రత్యేక స్పేస్‌ ఏర్పరచుకున్నాం. నిజాయితీగా గల స్నేహం మమ్మల్ని ఒక్కటి చేసింది. ఇప్పుడు దాంపత్య బంధంలో కూడా అంతే నిజాయితీగా ముందుకు సాగుతున్నాం’ అని అంగద్‌ కపుల్‌ గోల్స్‌ గురించి చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది సోనమ్‌ కపూర్‌- ఆనంద్‌ అహుజాల పెళ్లి ముచ్చట్లలో మీడియా మునిగిపోయిన వేళ తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు నేహా దుఫియా- అంగద్‌ బేడీ. ఎప్పుడూ తమ మధ్య ఉన్న బంధాన్ని బహిరంగంగా ప్రకటించని ఈ జంట సరిగ్గా ఇదే రోజున పంజాబీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితుల మధ్య దంపతులుగా మారిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం కూతురు మెహర్‌ ఉంది.

మరిన్ని వార్తలు