సరికొత్త స్వర్గం చూపించాం!

3 Nov, 2017 00:14 IST|Sakshi

‘పూలు అమ్మలకి నాన్నలు పెడతారు.. ఐ నో ఇట్‌. మరి, ఈ అమ్మాయికి ఎందుకు పెట్టినట్టు.. అంత భయపడేవాడివి ఎందుకు పెట్టావ్‌? తల్లో మల్లెపూలు పెట్టాలి’ అంటూ ముద్దు ముద్దు మాటలతో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో వెంకటేశ్‌ని బ్లాక్‌మెయిల్‌ చేసిన బాలనటుడు నాగ అన్వేష్‌ ‘వినవయ్యా రామయ్యా’తో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ యువహీరో నటించిన చిత్రం ‘ఏంజెల్‌’. హెబ్బాపటేల్‌ కథానాయిక. ‘బాహుబలి’ పళని దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్‌ సాగర్‌ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగ అన్వేష్‌ మీడియాతో ముచ్చటించారు.

► రెండో సినిమా సోషియో ఫాంటసీ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. కథ నచ్చింది. అందుకే చేశా. ‘ఏంజెల్‌’ సినిమాకు ఒకటిన్నర సంవత్సరం స్క్రిప్ట్‌ వర్క్‌ జరిగింది. 4 నెలలు షూటింగ్‌ చేశాం. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌కి ఆర్నెల్లు పట్టింది. నేను, సప్తగిరి ఒక విగ్రహాన్ని స్మగ్లింగ్‌ చేస్తుంటాం. ఆ సమయంలోనే హెబ్బా పటేల్‌ స్వర్గం నుంచి భూమికి వస్తుంది. ఆమె మమ్మల్ని ఎందుకు కలిసింది? మా జర్నీ ఎలా సాగింది? అన్నదే కథ.

► ఈ సినిమాలో నాది ఫన్‌తో కూడుకున్న కొంచెం మాస్‌ క్యారెక్టర్‌. వినోద ప్రధానంగా ఉంటుంది.  కథ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది.

► నా మొదటి సినిమాకంటే ఈ సినిమాకి కాస్త ఫిజిక్‌ పెంచా. నటన పరంగా కూడా ఇంప్రూవ్‌మెంట్‌ కనిపిస్తుంది. ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. శాటిలైట్‌ రైట్స్‌ కూడా బాగానే అమ్ముడయ్యాయి. తెలుగులో రిలీజ్‌ చేశాక తమిళం, హిందీలోనూ ‘ఏంజెల్‌’ ని విడుదల చేయాలనే ఆలోచన ఉంది.

► సినిమాలో ముందు 12 నిముషాల గ్రాఫిక్స్‌ అనుకున్నాం. కానీ, అవి కాస్తా 40 నిముషాలకు పెరిగాయి. అందుకే సినిమా విడుదల కాస్త ఆలస్యమైంది. స్వర్గాన్ని సరికొత్త తరహాలో చూపిస్తున్నాం. క్లైమాక్స్‌ ఫైట్‌ కూడా గ్రాఫిక్స్‌తోనే తీశాం. సినిమా పట్ల మా అమ్మ, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు