విడాకులపై స్పందించిన ప్రముఖ హాలీవుడ్‌ నటి

7 Oct, 2019 12:55 IST|Sakshi

హాలీవుడ్‌లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా  గుర్తింపు పొందిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీలు తమ వైవాహిక జీవితానికి స్వస్థి పలికిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట.. 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారి మధ్య విబేధాలు పొడ చూపడంతో.. 2016లో వివాహబంధానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏంజెలినా జోలీ విడాకుల వల్ల తాను ఎంత ఒత్తిడికి గురయ్యారో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బ్రాడ్‌ పిట్‌ నుంచి విడాకులు పొందిన తర్వాత నేను చాలా తీవ్ర దుఖాన్ని అనుభవించాను. నా తలరాతలో ఏం రాసిపెట్టి ఉందో నాకు తెలియదు కానీ.. నేను పరివర్తన కాలంలో ఉన్నట్లు మాత్రం నాకు అర్థం అయ్యింది. మనిషి తన మూలాలను వెతుక్కుంటు వెళ్లినట్లు నేను.. నా అంతరంగం లోనికి ప్రయాణించడం ప్రారంభించాను’ అన్నారు జోలీ.

అంతేకాక ‘పిట్‌తో నా బంధం ముగింపుకు వచ్చిందని నాకు అర్థం అయ్యింది. ఆ సమయంలో నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు నాకు అనిపించింది. ఆ క్షణం నుంచి మేం విడిపోవడం ప్రారంభించాము. అది నాకు చాలా క్లిష్టమైన సమయం. జీవితంలో నేను ఎక్కడ ఉన్నది నాకు తెలియలేదు. ఆ సమయంలో నేను చాలా తీవ్రమైన, నిజమైన బాధను అనుభవించాను. అయితే ఈ బాధ నాకు చాలా మేలు చేసింది. ప్రతి మనిషి జీవితం ముగింపుకు వచ్చే సరికే మిగిలేది వినయం మాత్రమే అని తెలిసివచ్చింది. అదే నన్ను, నా జీవితంతో మళ్లీ ముడివేసింది’ అని తెలిపారు. ప్రస్తుతం జోలీ, డిస్నీ సంస్థ నిర్మిస్తున్న ‘మేలిఫిసెంట్: మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2014లో వచ్చిన ‘మేలిఫిసెంట్‌’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 18న ఇండియాలో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు