విడాకుల తర్వాత పిల్లలతో జనంలోకి హీరోయిన్

20 Oct, 2016 16:28 IST|Sakshi
విడాకుల తర్వాత పిల్లలతో జనంలోకి హీరోయిన్
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ.. హీరో బ్రాడ్‌పిట్‌తో విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారి బయటకు వచ్చింది. ఆమె తన పిల్లలతో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లినట్లు చెబుతున్నారు. తన అన్నయ్య జేమ్స్ హావెన్‌తో పాటు ఐదుగురు పిల్లలు షిలో, జహారా, పాక్స్, కవల పిల్లలు నాక్స్, వివియెన్నెలతో కలిసి జోలీ వెళ్లింది. నల్లటి టాప్స్, అదేరంగు షార్ట్ట్ వేసుకున్న జోలీ.. కాళ్లకు మాత్రం కనీసం చెప్పులు కూడా లేకుండానే ఎయిర్‌పోర్టులో కనిపించింది. 
 
కాలిఫోర్నియా వెళ్లేందుకు ముందు హావెన్, పిల్లలు కలిసి ఒక బీచ్‌లో కూడా కనిపించినట్లు సమాచారం. ఈ ట్రిప్‌లో సెక్యూరిటీ గార్డులతో పాటు పిల్లల సంరక్షకులు కూడా ఉన్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బీచ్‌లో నడిచేటప్పుడు ఏంజెలీనా జోలీ చాలా ఉల్లాసంగా, ఆనందంగా కనిపించిందని అంటున్నారు. పిల్లలు కూడా నీళ్లలో ఆడుకున్నారని, తండ్రి తమవద్ద లేడన్న బాధ ఏమీ వారికి కనిపించలేదని చెబుతున్నారు. విడాకుల ప్రకటన తర్వాత జోలీ ఇలా కనిపించినా.. బ్రాడ్ పిట్ (52) మాత్రం ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు.