ఎంజీఆర్‌తో ఢీ

3 May, 2018 10:42 IST|Sakshi

తమిళసినిమా: లెజెండరీ యాక్టర్‌, చరిత్రకారుడు ఎంజీఆర్‌తో కలిసి నటించే అవకాశం కోసం అప్పట్లో చాలా మంది ఎదురుచూసి ఉంటారు. అలాంటి వారిలో అతి కొద్దిమందికే ఆయనతో నటించే అవకాశం లభించి ఉంటుంది. చాలా మందికి అది కలగానే మిగిలిపోయి ఉంటుంది. అలాంటిది ఎంజీఆర్‌ జీవించి లేకపోయినా ఆయనతో నటించే లక్కీ ఛాన్స్‌ను నటి అక్షరగౌడ్‌ అందుకుంది. అదేంటని ఆశ్చర్య పోతున్నారా. ఈ డిజిటల్‌ యుగంలో ఏదైనా సాధ్యమే.

ఎంజీఆర్‌ ఉలగం చుట్రుమ్‌ వాలిభన్‌ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌ చేయాలని భావించినా, ఆయన రాజకీయాల్లో బిజీ కావడంతో అది జరగలేదు. అయితే ఎంజీఆర్‌ ఉలగం చుట్రుమ్‌ వాలిభన్‌ చిత్రానికి సీక్వెల్‌ తాజాగా కిళక్కు ఆఫ్రికావిల్‌ రాజు పేరుతో తెరరూపం దాల్చుతోంది. ఇది కొంత భాగం యానిమేషన్‌లోనూ మరి కొంత భాగం నటీనటులు నటించే విధంగానూ రూపొందుతోంది.

ఎంజీఆర్, జయలలిత, నాగేశ్‌ వంటి పాత్రలు యానిమేషన్‌లోనూ ఇతర పాత్రలు నేరుగానూ ఉంటాయట. ఇందులో ఎంజీఆర్‌కు ప్రతినాయకిగా అక్షరగౌడ్‌ను ఎంపిక చేశారు. ఈ అమ్మడు ఇంతకుముందు ఉయిర్‌తిరు 420, తుపాకీ, ఆరంభం, ఇరుంబు కుదిరై, బోగన్‌  చిత్రాల్లో గ్లామరస్‌ విలనీయాన్ని ప్రదర్శించారు. కిళక్కు ఆఫ్రికావిల్‌ రాజు చిత్రంలో ఎంజీఆర్‌ ఆఫ్రికా వెళ్లినప్పుడు అక్కడ ఆయనతో  ప్రతినాయకిగా అక్షరగౌడ్‌ ఢీకొంటారని  చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు