పింక్‌ రీమేక్‌లో అంజలి?

16 Dec, 2019 00:12 IST|Sakshi
అంజలి

రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో విడుదలైన ‘పింక్‌’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అనిరుద్ధ రాయ్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, తాప్సీ, కృతీ కల్హరీ, ఆండ్రియా టారియంగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత బోనీకపూర్‌ ‘పింక్‌’ చిత్రాన్ని గత ఏడాది తమిళంలో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్‌ చేశారు. ఇప్పుడు ‘పింక్‌’ చిత్రం తెలుగులో రీమేక్‌ కానుంది. ‘దిల్‌’ రాజు, బోనీ కపూర్‌ నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి.

‘ఓ మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ’ చిత్రాల ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. తమన్‌ స్వరకర్త. ఈ సినిమాలో కథ రీత్యా ముగ్గురు అమ్మాయిల పాత్రలు ఉంటాయి. వీరిలో ఇద్దరు అమ్మాయిలుగా అంజలి, నివేదా థామస్‌ నటించబోతున్నారని లేటెస్ట్‌ టాక్‌. ఇక హిందీ ‘పింక్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది.

మరిన్ని వార్తలు