త్రీడీలో భయపెట్టే లీసా

9 May, 2019 00:14 IST|Sakshi
అంజలి

‘గీతాంజలి’ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టిన  తెలుగమ్మాయి అంజలి మరోసారి భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన త్రీడీ చిత్రం ‘లీసా’. రాజు విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. వీరేష్‌ కాసాని సమర్పిస్తున్న ఈ  చిత్రాన్ని ఎస్‌.కె. పిక్చర్స్‌ పతాకంపై సురేష్‌ కొండేటి విడుదల చేస్తున్నారు. సురేష్‌ కొండేటి మాట్లాడుతూ– ‘‘గతంలో అంజలి నటించిన ‘షాపింగ్‌ మాల్, జర్నీ’ సినిమాలను ఎస్‌.కె. పిక్చర్స్‌ ద్వారా తెలుగులో రిలీజ్‌ చేశాం. ఆ సినిమాలను ఎంతో బాగా ఆదరించిన ప్రేక్షకులు ‘లీసా’ చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. త్రీడీలో విడుదలవుతున్న మొట్టమొదటి హారర్‌ చిత్రమిది’’ అన్నారు. ‘‘గతంలో వచ్చిన హారర్‌ చిత్రాలకు విభిన్నంగా ‘లీసా’ ఉంటుంది’’ అన్నారు కాసాని వీరేశ్‌.

రాజు విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘100 రోజులకు పైగా ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. 3డీలో షూటింగ్‌ చాలా కష్టమైన పని. కానీ పి.జి.ముత్తయ్య గారి ఫ్రేమ్స్, ఆయన కష్టం వల్ల శరవేగంగా పూర్తయింది. అంజలిగారు టైటిల్‌ రోల్‌కి న్యాయం చేశారు. త్వరలో ఆడియో, ట్రైలర్‌లను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘మొదటిసారి 3డి చిత్రం చేశా. రాజులాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు’’ అన్నారు అంజలి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ దయానిధి మాట్లాడారు. బ్రహ్మానందం, సామ్‌ జోన్స్, మకరంద్‌ దేశ్‌ పాండే, సలీమా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి.ముత్తయ్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రహాస్‌ ఇప్పలపల్లి.

మరిన్ని వార్తలు