ఆ పాటలను వెంకటేశ్‌తో పాడించా...

13 Jan, 2015 23:21 IST|Sakshi
ఆ పాటలను వెంకటేశ్‌తో పాడించా...

‘‘ఒక పాట తయారు చేసే ముందు సన్నివేశాన్నీ, హీరో శారీరక భాషనూ దృష్టిలో పెట్టుకుంటాను. అలాగే, దర్శకుడి అభిరుచికి ప్రాధాన్యం ఇస్తాను. ఫైనల్‌గా నా ఆత్మసంతృప్తి కూడా నాకు ముఖ్యమే’’ అని సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. మనం, లౌక్యం, గోపాల గోపాల... ఇలా వరుస విజయాలతో ‘మోస్ట్ వాంటెడ్’ మ్యూజిక్ డెరైక్టర్ అయ్యారు అనూప్.
 
  ఈ సందర్భంగా తన మనోభావాలను పాత్రికేయులతో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘తేజ ‘జై’ నుంచి మొదలుపెట్టి ఈ మధ్య విడుదలైన ‘గోపాల గోపాల’ వరకు ఇప్పటివరకు 37 చిత్రాలకు పాటలు స్వరపరిచాను. రీమేక్ చిత్రాలకు పాటలు చేసేటప్పుడు కొంచెం ఒత్తిడి ఉంటుంది. మాతృకలో ఉన్న ట్యూన్స్‌ని యథాతథంగా చేయాలా? వేరే ఇవ్వాలా? అనే కన్‌ఫ్యూజన్ ఉంటుంది’’ అని చెప్పారు. ‘మనం’ చిత్రానికి పాటలివ్వడం ఓ గొప్ప అనుభూతి అని చెబుతూ -‘‘ఆ చిత్రం పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ డి. సురేశ్‌బాబుకి నచ్చాయి. అలా ‘గోపాల గోపాల’కు పనిచేసే అవకాశం వచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్‌లో కీ బోర్డ్ ప్లేయర్‌గా చేశాను.
 
  అలాగే, సురేశ్‌బాబుగారి అమ్మాయి పెళ్లికి మొత్తం కుటుంబంతో ‘దగ్గుబాటి..’ పాట చేశాను. ఆ పాటలను వెంకటేశ్‌గారితో కూడా పాడించాను’’ అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘టెంపర్’కి, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి పాటలు స్వరపరుస్తున్నానని అనూప్ చెప్పారు. అనంతరం బీఏ రాజు చేతుల మీదగా ‘అనూప్‌రూబెన్స్‌డాట్‌కామ్’ ఆవిష్కరణ జరిగింది.