ఇక్కడ విలన్‌ అక్కడ హీరో

1 Apr, 2017 23:35 IST|Sakshi
ఇక్కడ విలన్‌ అక్కడ హీరో

‘‘నేను సెటిలైంది ముంబైలో అయినప్ప టికీ హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. మా పూర్వీకులు ఇక్కడే ఉండేవాళ్లు. నాకు తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది’’ అని అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. శుక్రవారం విడుదలైన ‘రోగ్‌’లో ఆయన విలన్‌గా నటించారు. అంతకుముందు ‘విన్నర్‌’, ‘సింగమ్‌–3’ చిత్రాల్లో నటించిన అనూప్‌ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చారు.

కెరీర్‌ గురించి అనూప్‌ సింగ్‌ పత్రికలవారితో మాట్లాడుతూ – ‘‘బుల్లితెర నటుడిగా ‘మహాభారతం’ గుర్తింపు తెచ్చింది. ‘టెంపర్‌’ షూటింగ్‌ చూసినప్పుడు పూరీగారంటే అభిమానం ఏర్పడింది. ఆయన సినిమాల్లో చేయాలనుకున్నా. ‘రోగ్‌’కి ఛాన్స్‌ వచ్చినప్పుడు మిస్టర్‌ వరల్డ్‌ గెల్చుకున్నప్పుడు కన్నా రెట్టింపు ఆనందం కలిగింది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాను. మరాఠీలో రెండు సినిమాల్లో హీరోగా యాక్ట్‌ చేస్తున్నా. హిందీ సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.