తెరపైకి మరో వారసురాలు

5 Jan, 2017 01:46 IST|Sakshi
తెరపైకి మరో వారసురాలు

సినిమా చాలా బలమైన మాధ్యమం అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సినిమా చాలా ఉపయోగపడుతుందన్నది తెలిసిన విషయమే. అందుకే ఇతర రంగాల్లోని ప్రముఖులు ఆ మాధ్యమాన్ని వాడుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ దివ్య తన భావాలను వ్యక్తం చేయడానికి సినిమాను మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈమె సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ కూతురు అన్నది గమనార్హం. పౌష్టికాహారం, శారీరక వ్యాయామం అంశాల గురించి ఒక లఘు చిత్రం తెరకెక్కనుంది.

ఇందులో ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కథాంశం ఉంటుందని దివ్యా సత్యరాజ్‌ అన్నారు.ఆమె విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటే శారీరక వ్యాయామం అవసరం లేదని, శారీరక వ్యాయామం చేస్తుంటే ఆహారం విషయంలో నియమాలు పాటించనవసరం లేదని చాలా మంది భావిస్తున్నారని, తన వద్దకు వచ్చే వారి భావాలను చూస్తే అర్థమైందన్నారు. అయితే మనిషికి శారీరక వ్యాయామం చాలా అవసరం అన్నారు. ఇక పౌష్టికాహారపు అలవాట్లు చాలా ముఖ్యం అని చెప్పారు. ఇలాంటి పలు అంశాల గురించి తెలిపే లఘు చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు.

తనతో పాటు పలువురు క్రీడాకారులు నటించనున్న ఈ లఘు చిత్రాన్ని ముంబైకి చెందిన ఒక కార్పొరేట్‌ సంస్థ నిర్మించనుందని, దీనికి వినీత్‌ రాజన్ దర్శకత్వాన్ని, సాషా ఛాయాగ్రహణం అందించనున్నట్లు దివ్యా సత్యరాజ్‌ వెల్లడించారు. దివ్యకు ఈ లఘు చిత్రం నటిగా వెండి తెరకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.