డైరీ నిండుతోంది

24 Jan, 2018 00:59 IST|Sakshi

అవును.. అనూ ఇమ్మాన్యుయేల్‌ డైరీ మెల్లిగా నిండుతోంది. ఇప్పటికే స్టార్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లోకి దగ్గరగా వచ్చేశారు. రానున్న సినిమాలతో ఓ ప్లేస్‌ కొట్టేస్తారు. ‘మజ్ను’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్‌’, ‘అజ్ఞాతవాసి’లోనూ మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’లో నటిస్తున్నారామె. అలాగే, నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఇటీవల ఆరంభమైన సినిమాలోనూ అనూనే కథానాయిక.

ఇప్పటికి రెండు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బబ్లీ బ్యూటీకి మరో సినిమా చేసే అవకాశం వచ్చిందట. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించనున్న చిత్రానికి అనూని కథానాయికగా అడిగారట. ఇది కూడా సైన్‌ చేసేస్తే ఈ ఏడాది ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’లో కనిపించిన అనూ ఇమ్మాన్యుయేల్‌ మరో మూడు చిత్రాల్లో కనువిందు చేస్తారని ఊహించవచ్చు. ఏది ఏమైనా ఈ బ్యూటీ డైరీ మెల్లిగా నిండుతోంది. అన్నట్లు.. ఎన్టీఆర్‌–రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కించనున్న సినిమాలో అనూని ఓ కథానాయికగా అనుకుంటున్నారట. 

మరిన్ని వార్తలు