‘ఆమెను కలవడం కుదరడం లేదు’

24 Mar, 2017 13:05 IST|Sakshi
‘ఆమెను కలవడం కుదరడం లేదు’

న్యూఢిల్లీ: తన భార్య కిరణ్ ఖేర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తామిద్దరం తరచుగా కలుసుకోవడం కుదరడం లేదని సీనియర్ నటుడు అనుమప్‌ ఖేర్‌ వెల్లడించారు. ఏకాంతంగా గడిపే సమయం చిక్కడం లేదని అన్నారు. ‘నా భార్య ఎంపీగా గెలిచినప్పటి నుంచి మేమిద్దరం కలిసి గడిపేందుకు టైమ్ దొరకడం లేదు. తన నియోజకవర్గ పనుల్లో కిరణ్ తీరిక లేకుండా గడుపుతోంది. చండీగఢ్ నియోజకవర్గానికి ఆమె ఎక్కువ సమయం కేటాయించి, ప్రజల కోసం పనిచేస్తోంద’ని అనుమప్‌ ఖేర్ అన్నారు.

వీరిద్దరి వివాహ బంధానికి మూడు దశాబ్దాలు దాటింది. 1985లో వీరు పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నారు. అనుమప్ ఖేర్ సినిమాల్లో నటిస్తుండగా, కిరణ్ ఖేర్‌ చండీగఢ్‌ ఎంపీగా సేవలందిస్తున్నారు. జాతీయ  అవార్డు గ్రహీత అయిన 62 ఏళ్ల అనుమప్ 500పైగా సినిమాల్లో నటించారు.

చండీగఢ్‌, ఢిల్లీలో ఉన్నప్పుడు మాత్రమే తామిద్దరం కలుసుకునేందుకు వీలవుతుందని అనుమప్ తెలిపారు. ‘ఈ రోజు ఢిల్లీలో ఉన్నాను. నా భార్యతో కలిసి కాఫీ తాగేందుకు అవకాశం చిక్కింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న కిరణ్ ఢిల్లీలో ఉంది. ఈ రోజు రాత్రే నేను ఢిల్లీ నుంచి వెళ్లాల్సివుంది. కాబట్టి కాఫీకి మాత్రమే అవకాశముంది. పరస్పరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామ’ని అనుపమ్‌ ఖేర్‌ వివరించారు.