రంగోలి ఇక చాలు.. చాలా దూరం వెళ్తుంది

4 Jul, 2019 18:44 IST|Sakshi

హీరోయిన్‌ తాప్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ. కంగన నటించిన ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉందంటూ సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో తాప్సీ కూడా ట్రైలర్‌ బాగుందంటూ ట్వీట్‌ చేశారు.

అయితే తాప్సీ ట్వీట్‌పై కంగనా సోదరి రంగోలీ స్పందిస్తూ.. ‘కొంతమంది కంగనను కాపీ కొడుతూ బతికేస్తుంటారు. వారంతా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి.. ట్రైలర్‌ను బాగుందని ప్రశంసించేటప్పుడు కనీసం కంగన పేరు కూడా ప్రస్తావించరు. ఓసారి తాప్సి కంగనను ఉద్దేశిస్తూ ఆమె ఓ అతివాది అని వ్యాఖ్యనించారు. తాప్సీ.. ముందు మీరు ఇలా చీప్‌గా ఇతరుల వర్క్‌ను కాపీ కొట్టడం ఆపండి’ అంటూ రంగోలీ ట్వీట్‌ చేశారు.
 

దాంతో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కలగజేసుకుని రంగోలీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘రంగోలీ.. ఇది చాలా దూరం వెళుతోంది. నేను నీ సోదరి కంగనతో, తాప్సితో కలిసి పనిచేశాను. ట్రైలర్‌ను మెచ్చుకున్నారంటే.. అందులోని నటీనటులను కూడా మెచ్చుకున్నట్లే కదా?’ అని ప్రశ్నించారు. ఇందుకు రంగోలి స్పందిస్తూ.. ‘సర్‌..  మీరు ఉదయం నుంచి కంగనకు ఫోన్లు చేస్తూ.. ‘తాప్సీ నీకు పెద్ద ఫ్యాన్‌’ అని చెబుతున్నారు. తాప్సీ ఆ మాట ఏ సందర్భంలో అన్నారో నిరూపిస్తారా? ఆవిడ ఎప్పుడూ కంగనను విమర్శిస్తూనే ఉంటారు’ అని మండిపడ్డారు రంగోలీ. ప్రకాశ్‌ కోవేలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

మరిన్ని వార్తలు