‘వారికి అలా మాట్లాడే ధైర్యం లేదు’

7 Jan, 2020 13:11 IST|Sakshi

ముంబై : తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందుకు తన ట్విటర్‌ ప్రొఫైల్‌ ఫోటోనే కారణమైంది. అనురాగ్‌ తన ట్విటర్‌ ప్రొఫైల్‌ ఫోటోను ఆదివారం మార్చారు. ఇందులో ఏముంది అనుకోకండి.. తన పాత పిక్చర్‌ను మార్చి మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రిఅమిషాల ఫోటోను పెట్టారు. ఢిల్లీలో జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం జరిగిన దుండగుల దాడిని వ్యతిరేకిస్తూ.. మోదీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ  అనురాగ్‌  ఈ ఫోటోను పెట్టారు.(అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్‌ లేదు: కేంద్ర మంత్రి)

కాగా ముసుగులు ధరించిన దుండగులు ఆదివారం రాత్రి జేఎన్‌యూ క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై, ఉపాద్యాయులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే అధికార బీజేపీ ఇలా ముసుగులు ధరించి ఎవరికీ తెలియకుండాప్రజలపై దాడికి పాల్పడుతోందన్న ఉద్దేశంతో అనురాగ్‌ ఇలా చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఈ దాడిని నిరసిస్తూ ప్రతిపక్షాలు, బాలీవుడ్‌ ప్రముఖులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిన్న(జనవరి 6)రాత్రి ముంబైలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలో అనురాగ్‌ కశ్యప్‌ కూడా పాల్గొన్నారు. ఇక అనురాగ్‌ పెట్టిన ఈ ఫోటోకు  వేల మంది లైకులు కొట్టడంతోపాటు, అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రొఫైల్‌ ఫోటోను మార్చడంతో కొంతమంది అనురాగ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

అయితే అత్యధిక మంది ‘స్టాండ్‌ విత్‌ అనురాగ్‌ కశ్యప్‌’ హ్యష్‌ట్యాగ్‌తో...అనురాగ్‌కు మద్దతు తెలుపుతున్నారు. ‘‘ మీ ప్రతి ట్వీట్‌ మమ్మల్నీ ప్రేరేపిస్తోంది. గర్వంగా ఉంది సార్,  దాడి తప్పు అని ప్రజలకు తెలిసినా..వారు మౌనంగా ఉన్నారు. వారికి చెడుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు’’ అంటూ నెటిజన్లు కామెంట్‌ పెడుతూ.. అనురాగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు