ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం

1 Jun, 2018 08:53 IST|Sakshi

తమిళసినిమా: ఎంత కష్టపడి నటించినా ఫలితం శూన్యమే నంటోంది నటి అనుష్క. ఇప్పుడు అగ్రనటి అనే పదానికి అడ్రస్‌ అనుష్క. టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ బాలీవుడ్‌ అవకాశాలు వచ్చినా, దక్షిణాది సినిమానే చాలు, ఇక్కడే సంతృప్తిగా ఉందంటూ హిందీ చిత్రాలపై ఆసక్తి చూపని అనుష్క ఈ రెండు భాషల్లోనూ స్త్రీ ప్రధాన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందనే చెప్పాలి. అరుంధతి చిత్రం అందలం ఎక్కించడంతో బాహుబలి, భాగమతి వంటి చిత్రాలతో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు పెట్టింది పేరుగా మారింది. అలాంటి అనుష్క తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పటి వరకూ స్పష్టత లేదు. అలాంటి తీయని వార్త గురించి ఆమె అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే పలు అవకాశాలు తలుపు తడుతున్నా, సరైన కథా పాత్ర కోసం ఎదురు చూస్తున్నానంటున్న అనుష్క తాను 13 ఏళ్లుగా కథానాయకిగా రాణిస్తునందుకు కారణం అభిమానులేనంటోంది.

దీని గురించి ఈ స్వీటీ ఒక భేటీలో పేర్కొంటూ నటీనటులు సినిమా అవకాశాలను దక్కించుకున్నా, ప్రతిభను చాటుకున్నా అభిమానుల ఆదరణ లభిస్తేనే గౌరవం దక్కుతుందని అని పేర్కొంది. వారికి నచ్చకపోతే ఎంత కష్టపడి నటించినా ఫలితం శూన్యం అని అంది. తనకు అభిమానుల ఆదరణ చాలానే ఉందని చెప్పింది. అరుంధతి, బాహుబలి, భాగమతి చిత్రాల తరువాత ప్రతిభావంతమైన నటి అని ప్రశంసిస్తున్నారంది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లో నటించగలిగే నటి అని కీర్తిస్తున్నారని అంది. అలా తనకు నటిగా మంచి స్థాయిని అందించారని చెప్పింది. అయితే ముందు తరంలో 30, 40 ఏళ్ల పాటు కథానాయికలను గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగానూ, గర్వంగా ఉందని అంది. ఇప్పటి సౌకర్యాలు అప్పటి కథానాయికలకు లేవని, వాళంతా కష్టపడి ప్రతిభను చాటుకుని రాణించారని పేర్కొంది. అలాంటి వారితో పోల్చుకుంటే తాను, ఇతర నటీనటులు సాధారణమైన వాళ్లం అని అంది. తాము పడే కష్టం కూడా తక్కువేనని, ప్రస్తుతం ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే చాలని నటి అనుష్క పేర్కొంది. 

మరిన్ని వార్తలు