బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా లేకపోవడం విశేషం. 2018లో విడుదలైన ఆనంద్ ఎల్ రాయ్ ‘జీరో’ సినిమా తర్వాత అనుష్క ఏ సినిమాలో నటించలేదు. ఈ నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉండటంపై స్పందించారు అనుష్క. విరాట్ కోహ్లితో వివాహం తర్వాత వరుసగా సినిమాలతో బీజీగా ఉండడంతో, కుటుంబంతో కలసి ఉండే సమయం తగ్గిందని, అందుకే సినిమాలకు కాస్తా విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రెండు మూడు నెలలు విరామం తీసుకొని కుటుంబంతో, విరాట్తో సమయం గడుపుతున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం తమపై మరో ప్రాజెక్టు చేయాలనే ఒత్తిడి ఉన్నప్పటికీ ఇలాంటి రంగాల్లో పనిచేసేవారికి సమయానికి తగిన విశ్రాంతి కూడా అవసరమని స్పష్టం చేశారు. అయితే అభిమానుల నుంచి తమపై ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారనే ప్రశ్నలు వస్తుంటాయని వాటన్నింటికి సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. సినిమాలకు విరామం ఇచ్చిన అనుష్క ప్రస్తుతం తన నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్ పనులతో బీజీగా ఉన్నారు.